ఆరున్నర ఏళ్లలో 73 శాతం జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దే
telangana 73 % salary hike for employees : ఉద్యోగులకు కేవలం ఆరున్నర సంవత్సరాలలో 73 శాతం జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ సీఎం కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక వేతనాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్కు కొత్తగా 60 మంది సిబ్బంది నియమితులయ్యారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్తో కలిసి మంత్రి కొత్తగా నియమితులైన సిబ్బందికి నియామకపత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ విభాగంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నియామకాలు చేపట్టిందని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ పాలనలో నియామకాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయని..నీళ్లు, నిధులు,నియామకాలు అనే నినాదాన్ని సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో సంపూర్ణ న్యాయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు.
గతంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రవాణా అయ్యేందని చెప్పారు. ప్రస్తుతం అక్రమ రవాణాను అరికట్టామని, దీంతో ఆదాయం పెరిగిందని తెలిపారు. కొత్తగా నియమితులైన ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.