Accused Suicide : తూప్రాన్ కారు దగ్ధం, వ్యాపారి హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య
తూప్రాన్ కారు దగ్ధం, హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డా.చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నాడు.
Tupran trader murder case : మెదక్ తూప్రాన్ కారు దగ్ధం, వ్యాపారి హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడిని నీట్ రాయించేందుకు తీసుకొచ్చిన చంద్రశేఖర్.. భార్యను ఇంటికి పంపించి హైదరాబాద్లోని ఓ హోటల్లో సూసైడ్ చేసుకున్నాడు.
గత నెల 10న మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కారు డిక్కీలో డెడ్ బాడీ మిస్టరీ కలకలం రేపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ను కారులో ఉంచి దగ్ధం చేశారు నిందితులు. మంగళపర్తి-యశ్వంత్రావు పేట్ గ్రామ శివారులో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ హత్యలో చంద్రశేఖర్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నిందితులకు సహకరించాడనే ఆరోపణలు ఉన్నాయి.
మెదక్లో పిల్లల వైద్యుడిగా పని చేస్తున్న చంద్ర శేఖర్… వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే చంద్రశేఖర్ భార్య కూడా డాక్టర్గానే పనిచేస్తున్నారు. అయితే శ్రీనివాస్ హత్య కేసులో ఆరోపణలు రావడంతో చంద్రశేఖర్ మనస్థాపానికి గురైనట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంట్లోనూ సమస్యలు రావడంతో భార్యకు విడాకులు ఇవ్వాలని కూడా ఇటీవల చూస్తున్నట్టు సమాచారం.
Telangana : మెదక్ తూప్రాన్ కారు దగ్ధం కేసులో కొత్త ట్విస్ట్!
ఇదే క్రమంలో కుమారుడిని నిజాంపేటలో నీట్ రాయించేందుకు తీసుకొచ్చిన చంద్రశేఖర్.. భార్యను ఇంటికి పంపించి నగరంలోని ఒక హోటల్లో గది అద్దెకు తీసుకున్నాడు. అదే గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతని ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.
హైదరాబాద్ కూకట్పల్లిలో ఆత్మహత్యకు పాల్పడ్డ డాక్టర్ చంద్రశేఖర్ కేసులో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. చంద్రశేఖర్ ఆత్మహత్యకు, గతంలో జరిగిన రియల్టర్ శ్రీనివాస్ హత్యకు సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆత్మహత్య జరిగిన రూమ్లో సర్జికల్ బ్లేడు, నైలాన్ తాడును గుర్తించామన్నారు.
లభించిన ఆధారాలను బట్టి చూస్తే చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకునేందుకే హోటల్కు వచ్చినట్టు ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. రూమ్లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని.. చంద్రశేఖర్ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే దర్యాప్తు చేస్తున్నామన్నారు.