నిఖార్సైన హిందువుని నేనే : కేసీఆర్

  • Published By: chvmurthy ,Published On : March 31, 2019 / 02:30 PM IST
నిఖార్సైన హిందువుని నేనే : కేసీఆర్

మహబూబ్ నగర్ : కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పటానికి వస్తున్నాడనే సరికి మోడీకి, రాహుల్ కు భయం పట్టుకుందని  టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. మే 23 తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమి ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తుందని అప్పుడు బీజేపీ భరతం పడతామని  కేసీఆర్ హెచ్చరించారు. మహబూబ్ నగర్ లో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన  మాట్లాడుతూ….. దేశంలో గడిచిన 5 ఏళ్లలో  బీజేపీ  ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలని అన్నారు. ఐదేళ్లలో బీజేపీ చేసిందేమి లేదని 29 రాష్ట్రాలలో కంటే అంగన్ వాడీలకు  ఎక్కువ జీతాలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణా ఒక్కటే అని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో  బీజేపీకి అధికారం ఇస్తే పాలమూరు  ప్రాజెక్టు కడతామన్నమోడీ ఎందుకు కట్టలేదని కేసీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పధకాలను మోడీ  కాపీ కొట్టారని, గడిచిన 5 ఏళ్లలో మోడీ రైతులకు చేసిందేమి లేదని కేసీఆర్ అన్నారు. మిషన్ బగీరధకు, మిషన్ కాకాతీయకు నిధులు ఇవ్వమని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినప్పటికీ మోడీ నిధులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 11 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని, దేశ భద్రత దృష్ట్యా గోప్యత పాటించాల్సిన అంశాలను మోడీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని కేసీఆర్ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఉంటాడు కానీ కేంద్రంలో బీసీల సంక్షేమం కోసం మంత్రిత్వ శాఖ ఉండదని, ఈవిషయమై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పెడచెవిన పెట్టిందని చెప్పారు. రాష్ట్రంలో 3వేల మంది ఎస్టీలను టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ లను చేసిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. 

దేశానికి దరిద్రం పట్టిందని, దాన్ని పోగొట్టాలంటే ఎవరో ఒకరు నడుం కట్టాలని, అవసరమైతే జాతీయ పార్టీ స్ధాపిస్తానని కేసీఆర్ చెప్పారు.  రాజ్యాంగంలో, న్యాయవ్యవస్దలో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేసీఆర్ తెలిపారు. జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ  యాక్ట్ తీసుకువస్తామని తెలిపారు. బీజేపీ వాళ్లు రాజకీయ హిందువులని, మేమే అసలైన హిందువులమని కేసీఆర్ అన్నారు. నేను చేసినన్ని యాగాలు ఎవరైనా చేశారు అని ఆయన ప్రశ్నించారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు ఉంటే వాడుకోవటం చేతకాని దద్దమ్మలు ,సన్నాసులు దేశాన్ని పాలిస్తున్నారని ఆయన బీజేపీని దుయ్యబట్టారు.