20 నిమిషాలు, 20వేలు.. ప్రాణం తీసిన ఫుల్‌ బాటిల్‌ చాలెంజ్

  • Published By: naveen ,Published On : July 14, 2020 / 12:41 PM IST
20 నిమిషాలు, 20వేలు.. ప్రాణం తీసిన ఫుల్‌ బాటిల్‌ చాలెంజ్

నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యం సేవించడంపై సరదాగా కాసిన పందెం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తిరిగి రాని లోకాలకు పంపింది. జిల్లాలోని మామడ మండలం అనంతపేటలో ఐదుగురు మిత్రులు విందు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఫుల్లుగా మందు తాగారు. అంతా మత్తులో ఉన్నారు. ఇదే క్రమంలో మద్యం తాగడంపై పందెం కాశారు. ఫుల్‌బాటిల్‌ మద్యాన్ని 20 నివిుషాల్లో తాగితే రూ.20వేలు ఇస్తామని ఇద్దరు మిత్రులు షేక్ ఖాజా రసూల్‌తో పందెం కాశారు. పందానికి రసూల్ అంగీకరించాడు.

సగం బాటిల్ తాగాక:
ఫుల్‌బాటిల్‌ మద్యాన్ని తాగడం మొదలుపెట్టాడు. సగం బాటిల్ తాగాక రసూల్ అకస్మాత్తుగా కుప్పకూలాడు. అపస్మారకస్థితికి వెళ్లాడు. ఇది చూసి మిత్రులు భయపడ్డారు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా రసూల్ మార్గమధ్యంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రసూల్ కు భార్య, కొడుకు ఉన్నారు. రసూల్ మృతితో వారు అనాథలుగా మారారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఆ ఇద్దరిపై కేసు నమోదు:
అతిగా మద్యం తాగేలా రెచ్చగొట్టి రసూల్ మరణానికి కారకులైన రత్తయ్య, నాగూర్ బాషాలపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మృతుని స్వగ్రామం ఏపీలోని ప్రకాశం జిల్లా. కాగా, తెలంగాణలోని నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చందా మండలం చింతలచందాలో తాపీ మేస్త్రీగా స్థిరపడ్డాడు.