Nagarjunasagar by-poll : నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో బీజేపీకి అసంతృప్తి సెగ
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో బీజేపీకి అసంతృప్తి సెగ తగులుతోంది. రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు అంజయ్య యాదవ్ సిద్ధమైయ్యారు.
Anjaiah Yadav ready to contest as BJP rebel candidate : నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నామినేషన్లకు నేడు చివరి తేదీ కావడంతో.. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులందరూ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు అధికార టీఆర్ఎస్.. దుబ్బాక ఫలితాన్ని రిపీట్ చేయాలన్న కసితో కమలదళం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన సీనియర్ నేత జానా రెడ్డిని ఎదుర్కొని సత్తా చాటేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. చివరి వరకూ అభ్యర్థిపై ఎటూ తేల్చకుండా మౌనం వహించిన సీఎం కేసీఆర్.. చివరి క్షణంలో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రతిపక్షాలకు షాకిచ్చారు.
టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత తమ అభ్యర్థిని ప్రకటించాలని ఎదురుచూసిన బీజేపీ అనుకున్నట్టుగానే వ్యూహాత్మకంగా వ్యవహరించింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ను ఖరారు చేసిన కొద్దిసేపటికే బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ పానుగోతు రవికుమార్ను తమ పార్టీ అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపింది. నిన్నటి వరకూ నివేదితా రెడ్డి, లేదా కడారి అంజయ్య యాదవ్కి టిక్కెట్ వచ్చే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు భావించాయి. అనూహ్యంగా రవికుమార్ పేరును తెరపైకి తెచ్చింది. నియోజకవర్గంలో ప్రధాన ఓటు బ్యాంకును టార్గెట్ చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గం నుంచి జానా రెడ్డి బరిలో ఉన్నారు. గత 2018 ఎన్నికల్లో జానా రెడ్డిని ఢీకొట్టి నోముల నర్సింహయ్య విజయం సాధించారు. యాదవ సామాజికవర్గం బలంగా ఉండడమే అందుకు కారణం. నియోజకవర్గంలో రెడ్డి ఓటర్లు సుమారు 23 వేలు ఉండగా బీసీల ఓట్లు లక్షకు పైగా ఉన్నాయ్. అందులోనూ యాదవ సామాజికవర్గ ఓట్లు సుమారు 34 వేలకు పైగా ఉన్నాయ్. నోముల నర్సింహయ్య యాదవ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో బలమైన ప్రత్యర్థి అయినప్పటికీ జానా రెడ్డిపై విజయం సాధించారు.
అభ్యర్ధుల విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కంటే వెనుకబడ్డ బీజేపీ.. అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా వ్యవహరించింది. ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా.. ఎవరూ ఊహించని విధంగా కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది. డాక్టర్ పనుగోతు రవికుమార్ పేరును అధికారికంగా ప్రకటించింది. సాగర్ నియోజకవర్గంలో ఎస్టీ ఓట్లు 40 వేలకు పైగా ఉన్నాయి. అందులో కేవలం లంబాడీలు 38 వేలు. కాంగ్రెస్, టీఆర్ఎస్ బలమైన సామాజికవర్గాలకు చెందిన నేతలకు టిక్కెట్లు కేటాయించడంతో ఎస్టీ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేందుకు బీజేపీ స్కెచ్ వేసింది. అందులో భాగంగానే డాక్టర్ పనుగోతు రవికుమార్ను అభ్యర్థిగా ఖరారు చేసిందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయ్.
మరోవైపు.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో బీజేపీకి అసంతృప్తి సెగ తగులుతోంది. రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు అంజయ్య యాదవ్ సిద్ధమైయ్యారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఇండిపెండెంట్గా అంజయ్య యాదవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక బీజేపీ నుంచి టిక్కెట్ ఆశించిన నివేదితా రెడ్డి… ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. పార్టీ అధిష్టానం రవికుమార్కు ఛాన్స్ ఇవ్వడంతో.. ఆమెకు నిరాశే ఎదురైంది. పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానన్నారు నివేదితారెడ్డి. మంగళవారం నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానని చెప్పారు.