Huzurabad: హుజురాబాద్ టీఆర్ఎస్ టిక్కెట్ ఆయనకేనా?
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు రెడీ అయ్యారు. ఇవాళ(21 జులై 2021) మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కౌశిక్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు.
Huzurabad Assembly bypoll: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు రెడీ అయ్యారు. ఇవాళ(21 జులై 2021) మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కౌశిక్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టంచేసిన కౌశిక్ రెడ్డి.. ఒక్క అవకాశం ఇవ్వండి.. టీఆర్ఎస్ను హుజురాబాద్లో గెలిపించండి అంటూ అభ్యర్థించారు. అంతకుముందు కూడా పార్టీ తనకే అంటూ అనుచరులకు స్పష్టం చేశారు కూడా.
అయితే, లేటెస్ట్గా మరో వ్యక్తి పేరు టిక్కెట్ రేసులో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గం టిక్కెట్ను గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తికి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా టీఆర్ఎస్ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నియోజకవర్గ టిక్కెట్ను, బీసీ లేదా రెడ్డి కమ్యునిటీకి చెందిన వ్యక్తులకు ఇవ్వాలని ఎప్పటినుంచో భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీ వాళ్లు కూడా వీరి బలాబలాలపై చర్చిస్తున్నారు..
రాబోయే వారం రోజుల్లో మాత్రం టిక్కెట్ విషయంలో క్లారిటీ వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు ఈటల రాజేందర్పై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడ గ్రామంలో తనను హత్య చేసేందుకు ఈటల ప్లాన్ చేశారంటూ కౌశిక్రెడ్డి ఆరోపించారు. తనపై జరిగిన దాడి నుంచి తృటిలో తప్పించుకున్నట్లు చెప్పారు.