ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారయత్నం కేసులో…ఆటోడ్రైవర్ సహా నలుగురు నిందితుల అరెస్టు

ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారయత్నం కేసులో…ఆటోడ్రైవర్ సహా నలుగురు నిందితుల అరెస్టు

attempted rape case of a pharmacy student : హైదరాబాద్‌ నగర శివార్లలో ఫార్మసీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నలుగురు నిందితులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్‌తో సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. యువతికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. యువతిపై నిందితులు రాడ్‌తో దాడి చేయడంతో కాలిపై బలమైన గాయమయింది. ఒంటిపై పలుచోట్ల గాయాలయ్యాయి. బాధితురాలు తీవ్ర భయాందోళనతో ఉందని, ఏం జరిగిందో చెప్పలేకపోతోందని క్యూర్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఘట్ కేసర్ సమీపంలోని ఓ కాలేజీలో చదువుతున్న ఫార్మసీ విద్యార్థిని.. కాలేజీ ముగిసిన తర్వాత ఆటోలో ఇంటికి బయల్దేరింది. ఆ విద్యార్థినిపై కన్నేసిన ఆటో డ్రైవర్.. కొద్ది దూరం వెళ్లిన తర్వాత మరో ఇద్దరు స్నేహితులను పిలిచించి.. బలవంతంగా పొదల్లోకి లాక్కెల్లాడు. ఆ ముగ్గురు యువతి బట్టలు చించేసి అత్యాచారయత్నం చేశారు. ఆతర్వాత రోడ్డుపై వదిలి పరారయ్యారు.

ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం 6గంటల 30నిమిషాల టైమ్‌లో నాగారం నుంచి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌ నగర్‌ బస్టాప్‌ వెళ్లేందుకు సెవన్‌ సీటర్‌ ఆటో ఎక్కింది. ఆమెతో పాటు తన సీనియర్, మరో ఇద్దరు ప్యాసింజర్లు కూడా ఉన్నారు. కొద్ది దూరం వెళ్లాక ఆ ముగ్గురూ దిగిపోయారు. బాధితురాలు మాత్రమే ఆటోలో ఉండటంతో ఇదే అదనుగా భావించిన డ్రైవర్‌.. ఆమె దిగాల్సిన చోట ఆపకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లాడు.

అనుమానం వచ్చిన విద్యార్ధిని తన తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే నిందితుడు మరికొందరి సాయంతో ఆమెను ఆటోలో నుంచి మారుతీ వ్యాన్‌లోని ఎక్కించాడు. వారంతా యానాంపేట సమీపంలోని పొదల్లోకి యువతిని తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. కుమార్తె ఫోన్‌తో అప్రమత్తమైన తల్లి.. బంధువుల సాయంతో డయల్ 100కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. అప్రమత్తమైన పోలీసులు.. బృందాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. బాధితురాలి ఫోన్‌ నంబర్‌ లొకేషన్‌ను ట్రేస్‌ చేశారు.. అది నిర్మాణం ఆగిపోయిన ఓ భవనం వద్ద చూపింది. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికే నిందితులు పారిపోయారు.

ఎట్టకేలకు రాత్రి 7గంటల 50నిమిషాల సమయంలో బాధితురాలి వద్దకు చేరుకున్న పోలీసులు వారి వాహనంలోనే.. ఆమెను మేడిపల్లిలోని క్యూర్‌ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలిపై అత్యాచారయత్నం మాత్రమే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, కుడికాలికి మాత్రం గాయమైందని తెలిపారు పోలీసులు. బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు.. బృందాలుగా విడిపోయి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక బాధితురాలిపై అత్యాచారం జరిగిందా? లేదా? అన్న దానిపై కాసేపట్లో వైద్యులు క్లారిటీ ఇవ్వనున్నారు.

మరోవైపు దారుణంపై తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఇంచార్జ్‌ మంత్రి మల్లారెడ్డితో మాట్లాడిన ఆమె.. అమ్మాయికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని క్యూర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు.