Bandi Sanjay: ప్రభుత్వానికి, గవర్నర్ కు జరుగుతోన్న వ్యవహారంలో బీజేపీ తల దూర్చదు: బండి సంజయ్
హైదరాబాద్ లో ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంపై బండి సంజయ్ స్పందిస్తూ..హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు
Bandi Sanjay: ఢిల్లీలో తెలంగాణ గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారిన ఈఅంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గవర్నర్ వ్యవస్థను ఏ ప్రభుత్వమైనా గౌరవించాల్సిందేనని..రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే కేసీఆర్..గవర్నర్ వ్యవస్థను గౌరవించాలని బండి సంజయ్ అన్నారు. గవర్నర్ తమకు ఏజెంట్ గా ఉండాలని టీఆర్ఎస్ కోరుకుంటోందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పంపిన దానికల్లా గవర్నర్ రబ్బరు స్టాంపులా ఆమోద ముద్ర వేయాలా? అంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి, గవర్నర్ కు జరుగుతోన్న వ్యవహారంలో బీజేపీ తల దూర్చబోదని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Also read:Chandrababu Letter : వైసీపీ నేత ఆత్మహత్యపై చంద్రబాబు బహిరంగ లేఖ
ఇక హైదరాబాద్ లో ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంపై బండి సంజయ్ స్పందిస్తూ..హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ ఓ ప్రైవేటు సంస్థలో 15 మంది ఉద్యోగులను తొలగించారని..దీన్నిబట్టి చూస్తే నగరంలో డ్రగ్స్ కల్చర్ ఏ స్థాయిలో ఉందొ అర్ధం అవుతుందని బండి సంజయ్ అన్నారు. డ్రగ్స్ నియంత్రణపై కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు ఉంటోందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ సన్నిహితుల కనుసన్నల్లోనే నగరంలో డ్రగ్స్ దందా నడుస్తుందంటు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పై బండి సంజయ్ విమర్శలు చేశారు. “డ్రగ్స్ మఠాలను అరెస్టు చేయలేని వాడు దేశాన్ని బాగుచేస్తాడా?..కేటీఆర్ ఒక పిట్టల దొర, కేటీఆర్ మాటలను పట్టించుకునేవారు లేరు” అంటూ బండి సంజయ్ అన్నారు. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉంటే బీజేపీ వాళ్ళను సైతం అరెస్టు చేయాలని కోరుతున్నానని బండి సంజయ్ అన్నారు. యువమోర్చా ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యవహారంలో పోరాటాలు చేస్తామని ఆయన అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వెంటనే ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Also read:Satyavathi Rathod: గవర్నర్ తమిళిసై ఆంతర్యం ఏంటో అందరికి అర్ధం అవుతుంది: మంత్రి సత్యవతి రాథోడ్