కరోనాతో జాగ్రత్త, కేసుల సంఖ్య తగ్గింది – సీఎం కేసీఆర్

  • Published By: madhu ,Published On : November 22, 2020 / 10:49 PM IST
కరోనాతో జాగ్రత్త, కేసుల సంఖ్య తగ్గింది – సీఎం కేసీఆర్

Beware with Corona – CM KCR : కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు సీఎం కేసీఆర్. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కోవిడ్ విజృంభిస్తుండటంతో.. రాష్ట్రంలో అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరగకుండా.. సెకండ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత భద్రత పాటించడమే కరోనాకు అసలైన మందని కేసీఆర్‌ సూచించారు. కోవిడ్ పరిస్థితిపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.



రాష్ట్రంలో మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయని.. కోవిడ్ కేసుల సంఖ్య బాగా తగ్గిందని చెప్పారు. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పదిశాతం లోపే ఉంటోందని.. రాష్ట్రంలో రికవరీ రేటు 94.5 శాతం ఉంటోందన్నారు సీఎం కేసీఆర్‌. కోవిడ్ వచ్చిన వారు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ.. మరణాల రేటు చాలా తక్కువగా ఉందని.. కరోనాపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణవ్యాప్తంగా 10వేల ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ముందు ఆరోగ్య సిబ్బందికే ఇవ్వాలని నిర్ణయించినట్లు కేసీఆర్ చెప్పారు.



మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 873 కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంచాలకులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. 1,296 మంది కోలుకున్నారని, నలుగురు చనిపోయారని తెలిపారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 11, 643గా ఉందని, గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 9 వేల 345గా ఉందన్నారు. జీహెచ్ఎంసీలో 152 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.