Sita Rama Kalyanam : భద్రాద్రి : భక్తులు లేకుండానే సీతారాముల కళ్యాణం..
Bhadrachalam Sri Sita Ramula Kalyanam 2021: భద్రాద్రిలో కొలువైన శ్రీ రాముడి కళ్యాణంపై కూడా కరోనా ప్రభావం పడింది. జనాలకే కాదు దేవుళ్లకు కూడా తప్పలేదు కరోనా కష్టాలు. రాములోరి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించాలని భక్తులు ఆశగా ఎదురుచూస్తారు. శ్రీరామ నవమి సందర్భంగా జరిగే కళ్యాణాన్ని కళ్లారా చూడాలని సుదూరతీరాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. కానీ ఈ కరోనా కాలంలో భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణం భక్తులు లేకుండానే జపించాల్సి వస్తోంది. కారణం కరోనా. సెకండ్ వేవ్ తో జనాలను హడలెత్తిస్తున్న క్రమంలో అత్యంత వైభవంగా జరగాల్సిన సీతారాముల కళ్యాణం భక్తులు లేకుండానే జరిగింది. భక్తులు ఉంటే ఆ సందడే వేరు కదా..కానీ కరోనా కష్టకాలంలో భక్తులు రాకపోవటంతో అర్చకులు అతికొద్దిమంది అతిథుల సమక్షలోనే స్వామి వారి కళ్యాణం జరిపించారు.
రాములోరి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలం వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాముల వారి కళ్యాణం కళ్లార చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తుంటారు. అయితే, గతేడాది కరోనా లాక్ డౌన్ కారణంగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం నిరాడంబరంగా నిర్వహించారు.
గత సంవత్సరం కంటే కరోనా దాని ఉదృతిని పెంచింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భక్తులను అనుమతించకపోవటంతో ఉదయం 10.30 గంటలకు స్వామివారి కల్యాణఘట్టం ప్రారంభం అయ్యింది. కరోనా నిబంధనల దృష్ట్యా భక్తులకు అనుమతిని నిరాకరించారు. సీతారాములకు ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాముల కల్యాణ మహోత్సవానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.