రాములోరి కళ్యాణ తలంబ్రాలు గోతిలో పాతిపెట్టారు

రాములోరి కళ్యాణ తలంబ్రాలు గోతిలో పాతిపెట్టారు

Bhadradri : ప్రముఖ ఆలయాల్లో భద్రాద్రి దేవాలయం ఒకటి. ఇక్కడ శ్రీరామ నవమి నాడు నిర్వహించే..కళ్యాణానికి ప్రముఖ స్థానం ఉంటుంది. ఈ సందర్భంగా నిర్వహించే కళ్యాణాన్ని చూసేందుకు ఎక్కడి నుంచో భద్రాద్రికి చేరుకుంటుంటారు. అంతేగాకుండా..కళ్యాణం రోజు ఉపయోగించే తలంబ్రాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. తమకు ఇవ్వాలని భక్తులు పోటీ పడుతుంటారు. కానీ..కొద్ది మందికి మాత్రమే తలంబ్రాలు అందుతాయి. అయితే..టన్నుల కొద్ది మిగిలిపోయిన తలంబ్రాలను గోతిలో పాతిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో గత సంవత్సరం నిర్వహించిన శ్రీరామనవమికి సంబంధించి స్వామి వారి కళ్యాణ తలంబ్రాలు దేవస్థానంలో టన్నుల కొద్ది మిగిలిపోయాయి. ఇవన్నీ గొయ్యిలో పాతిపెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం ఫలితంగా..తలంబ్రాలు భక్తుల చేతికి అందకుండా పోయాయి. గత సంవత్సరం కరోనా కారణంగా…నిత్య కళ్యాణ మండపంలో రామ నవమి కళ్యాణం నిర్వహించారు.

తర్వాత..జులై వరకు భక్తులకు అనుమతిని నిరాకరించారు అధికారులు. దీంతో తలంబ్రాలు పంపిణీ చేయలేకపోయారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు..భక్తులను ఆలయంలోకి అనుమతించారు. కానీ…తలంబ్రాల పంపిణీ వేగవంతం చేయలేకపోయారని భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. స్వామి వారి కళ్యాణం తలంబ్రాలు కావాలని అడిగే భక్తులకు ఈసడింపులు, చీత్కారాలు సమాధానం చెప్పే సిబ్బంది…క్వింటాళ కొద్ది మిగిలిపోవడానికి కారణమయ్యారని ఆరోపిస్తున్నారు.

దేవస్థానం కీలక అధికారులు సైతం సరియైన రీతిలో పర్యవేక్షణ చేపట్టకపోవడం ప్రధాన లోపమని దేవస్థాన ఉద్యోగ వర్గాలే..అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. ఇదిలా ఉండగా..మిగిలిపోయిన తలంబ్రాలను ఏఈవో, ఇతర అధికారులు, సిబ్బంది అంతా దగ్గరుండి..మరి..20 అడుగుల లోతులో తీసిన గొయ్యిలో పాతిపెట్టడం చర్చనీయాంశంగా మారింది.