Bhuvanagiri Lok Sabha Constituency : తెలంగాణ రాజకీయాల్లో భువనగిరి పార్లమెంట్ స్థానానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ ప్రాంతం మీద పార్టీల ఆధిపత్యం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. గతంలో కాంగ్రెస్ వేవ్లో టీడీపీ విజయం సాధిస్తే.. బీఆర్ఎస్ ప్రభంజనంలో కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ ! అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు కౌంట్డౌన్ మొదలైన వేళ.. రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. భువనగిరి ఎంపీ సీటు కాంగ్రెస్ ఖాతాలో ఉండగా.. లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీల్లో బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. దీంతో ఎంపీ స్థానంతో పాటు అసెంబ్లీలను క్లీన్స్వీప్ చేయాలని గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తుంటే.. మళ్లీ పట్టు సాధించాలని కాంగ్రెస్ స్ట్రాటజీలు సిద్ధం చేస్తోంది. ఇక బీజేపీ ఈ స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. మరి ఏ పార్టీ సీన్ ఎలా ఉంది.. బీఆర్ఎస్ను టెన్షన్ పెడుతోంది ఏంటి.. కాంగ్రెస్కు ఇబ్బందిగా మారిన పరిణామాలు ఏంటి.. బీజేపీ దృష్టిసారించాల్సిన విషయాలు ఏంటి.. భువనగిరి ఖిల్లాపై జెండా ఎగురవేసే పార్టీ ఏది..
భువనగిరి రాజకీయాల్లో కాంగ్రెస్ మళ్లీ పట్టు సాధించడం సాధ్యమేనా ?
భువనగిరి లోక్సభ స్థానం 2009లో ఏర్పడింది. 2009లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించగా.. 2014లో బూర నర్సయ్య గౌడ్… గత ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు. 2019 ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్పై కేవలం 5వేల పైచిలుకు మెజారిటీతోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. దీంతో ఈసారి కచ్చితంగా భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని గులాబీ పార్టీ నేతలు ధీమాగా చెప్తున్నారు. ఐతే కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్లీ పోటీకి దిగుతారా లేదా అన్నది కొత్త చర్చకు కారణం అవుతోంది. హస్తం పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు వివాదాస్పదంగా ఉంది. రేవంత్ మీద భగ్గుమంటున్న ఆయన.. పార్టీకి అంటీముట్టనట్లు ఉంటారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారం ఒకవైపు.. నల్గొండ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని వెంకటరెడ్డి ప్రకటించడం మరోవైపు.. ఇలాంటి పరిణామాలు పార్టీ కేడర్ను డైలామాలోకి నెట్టేస్తున్నాయ్.
READ ALSO : Araku Lok Sabha Constituency : రాజకీయాలకు వార్ జోన్గా మారిన అరకు….ఆంధ్రా ఊటీ లో హాట్ హాట్ గా రాజకీయాలు
.
భువనగిరి నుంచి కాంగ్రెస్ తరఫున మధుయాష్కి పేరు
కోమటిరెడ్డి వ్యవహారంపై రకరకాల అనుమాలు కమ్ముకోవడంతో పాటు.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్తో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయ్. ఇక అటు బీఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్.. ప్రస్తుతం కమలం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గులాబీ పార్టీ తరఫున పోటీ చేసేది ఎవరు అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన కెసిఆర్.. పక్కాగా గెలిచే చాన్స్ ఉన్న అభ్యర్థినే భువనగిరి లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిపేందుకు సిద్ధం అవుతున్నారనే చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని పోటీకి దించితే బెటర్ అనే చర్చ పార్టీలో నడుస్తోంది. భువనగిరి స్థానంపై బీజేపీ నజర్ పెంచింది. ఈసారి కమలం పార్టీ తరఫున జిట్టా బాలకృష్ణారెడ్డి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ బూర నర్సయ్య గౌడ్, శ్యాంసుందర్ లాంటి నేతలు కూడా ఇదే సీటుపై కన్నేశారు.
భువనగిరి పార్లమెంట్ పరిధిలో భువనగిరి అసెంబ్లీతో పాటు.. నకిరేకల్, తుంగతుర్తి, మునుగోడు, ఆలేరు, జనగామ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలు ఉన్నాయ్. అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు.
హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో పైళ్ల
భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన పైళ్ల.. హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఐతే ఈసారి ఆయనకు కొంత గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్. సొంత పార్టీలో ఆధిపత్య పోరు శేఖర్ రెడ్డికి తలనొప్పిగా మారింది. జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డికి.. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డికి పొసగడం లేదు. సందీప్ రెడ్డి కూడా బీఆర్ఎస్ తరపున టికెట్ ఆశిస్తున్నారు. వ్యక్తిగతంగా బలమైన అనుచరవర్గం లేకపోవడం… పైళ్ల శేఖర్ రెడ్డికి మైనస్గా మారుతోంది. కాంగ్రెస్ తరఫున పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి… మరోసారి పోటీలో నిలిచే అవకాశం ఉంది. వివిధ కార్యక్రమాలతో అనిల్ కుమార్ రెడ్డి జనాల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ తరఫున జిట్టా బాలకృష్ణా రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. జిట్టా పేరు ఎమ్మెల్యే రేసులో దాదాపు ఖాయంగా కనిపిస్తున్నా.. అవసరాన్ని ఆ తర్వాత ఎంపీగానూ జిట్టా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయ్. ప్రస్తుతం పార్టీల తరఫున ఈ పేర్లు మాత్రమే వినిపిస్తున్నా.. ఎన్నికల టికి కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయ్.
ఆధిపత్య పోరుతో నకిరేకల్ లో చిరుమర్తికి ఇబ్బందులు….తెరవెనక రాజకీయం నడుపుతోన్న వేముల వీరేశం
ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్కం అయిన నకిరేకల్లో.. చిరుమర్తి లింగయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన చిరుమర్తి.. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఆయనపై పెద్దగా వ్యతిరేకత లేకున్నా.. ఆధిపత్య పోరుతో చిరుమర్తి ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వేముల వీరేశం.. తెర వెనక రాజకీయాలతో తన ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ స్థానిక ఎన్నికల్లో తన అభ్యర్థులను నిలిపి అధికార బీఆర్ఎస్కు తలనొప్పిగా మారుతున్నారనే అభిప్రాయం ఉంది. వేముల వీరేశానికి పార్టీ సభ్యత్వమే లేదని.. అతను బీఆర్ఎస్ పార్టీ నాయకుడే కాదని, అవకాశం దొరికినప్పుడల్లా ఎమ్మెల్యే చిరుమర్తి విమర్శిస్తున్నారు. లింగయ్య పార్టీ మారిన తర్వాత.. నియోజకవర్గంలో కాంగ్రెస్కు పెద్ద తలకాయ లేకుండా పోయింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామం ఇదే నియోజకవర్గంలో ఉన్నప్పటికీ… ఉనికి కోసం హస్తం పార్టీ పాట్లు పడుతోంది. దైద రవీందర్, కొండేటి మల్లయ్య కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశిస్తున్నారు. ఈ మధ్యే పార్టీలో చేరిన చెరుకు సుధాకర్ కూడా.. తన భార్యకు టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా.. ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న వేముల వీరేశం.. కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. బీజేపీ నుంచి శేపూరి రవీందర్… బీఎస్పీ నుంచి మేడి ప్రియదర్శిని టికెట్ ఆశిస్తున్నారు.
తుంగతుర్తిలో వ్యతిరేకత రాకుండా కిశోర్ వ్యూహాత్మక అడుగులు
తుంగతుర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా గాదరి కిశోర్ ఉన్నారు. జనాల్లో, పార్టీలో చిన్న వ్యతిరేకత కూడా రాకుండా.. చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు కిశోర్. ఈసారి కూడా బిఆర్ఎస్ తరఫున గాదరి కిశోర్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించిన కిశోర్.. ఈసారి మంచి మెజారిటీ సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీ నేతలతో కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్లో పరిస్థితి విచిత్రంగా ఉంది. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, అద్దంకి దయాకర్ మధ్య ఆధిపత్య పోరుతో… నియోజకవర్గంలో హస్తం పార్టీ రోజురోజుకు బలహీనంగా మారుతుందనే చర్చ జరుగుతోంది. అద్దంకి దయాకర్తో పాటు కాంగ్రెస్ ఎస్టీ సెల్ ఇంఛార్జ్ నాగరిగారి ప్రీతమ్, దామోదర్ రెడ్డి అనుచరుడు వడ్డేపల్లి రవి ఇక్కడి నుంటి టికెట్ ఆశిస్తున్నారు. దామోదర్ రెడ్డి మద్దతు ఉన్న అభ్యర్థికే.. టికెట్ దక్కే అవకాశం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. బీజేపీ నుంచి కడియం రామచంద్రయ్య బరిలో నిలిచే అవకాశం ఉంది.
READ ALSO : Kammam Politics : ఖమ్మం చుట్టూ తిరుగుతున్న తెలంగాణా రాజకీయం… గులాబీ పార్టీలో గ్రూపుల గుబులు
పొత్తులో భాగంగా మునుగోడు సీటును గులాబీ పార్టీ సీపీఐకి కేటాయించే ఛాన్స్…
మునుగోడులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరి పదవికి రాజీనామా చేయగా.. ఉప ఎన్నిక జరిగింది. బైపోల్లో కూసుకుంట్ల విజయం సాధించారు. ఐతే ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ ఫైట్ ఆసక్తికరంగా మారింది. కూసుకుంట్లపై పార్టీ నేతల్లో కొంత అసంతృప్తి ఉంది. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్తో పాటు పలువురు నేతలు ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. దీంతో గులాబీ పార్టీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. వామపక్షాలతో పొత్తులో భాగంగా.. ఈ సీటును సీపీఐకి కేటాయిస్తారన్న ప్రచారం నడుస్తోంది. దేవరకొండ, మిర్యాలగూడ, మునుగోడులో కనీసం రెండు సీట్లను వామపక్షాలు ఆశిస్తున్నాయ్. బీజేపీ నుంచి తానే బరిలోకి దిగుతానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. అదే జరిగితే మునుగోడు నుంచి తన కుమారుడు సంకీర్త్ రెడ్డిని బరిలో నిలిపే అవకాశాలు ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. బైపోల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పాల్వాయి స్రవంతి.. మరోసారి పోటీలో ఉండేందుకు రంగం సిద్దం చేసుకుంటుండగా.. ఆ పార్టీ నేతలు చలమల కృష్ణారెడ్డి, పున్నా కైలాశ్ నేత వంటి వారు కూడా ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు.
ఆలేరులో బీఆర్ఎస్ నుంచి సునీతకే మరోసారి టికెట్ దక్కే అవకాశం
ఆలేరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా గొంగిడి సునీత ఉన్నారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్నాణం, సుందరీకరణ… ఇతర అభివృద్ధి పనులు ఈసారి సునీతకు బాగా కలిసి రానున్నాయ్. బీఆర్ఎస్ నుంచి సునీతకే మరోసారి టికెట్ దక్కే అవకాశం ఉంది. ఒకవేళ మార్చాల్సి వచ్చినా.. సునీత భర్త, ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి అవకాశం దక్కుతుంది. ఈ మధ్యే టీఆర్ఎస్లో చేరిన బూడిద భిక్షమయ్య గౌడ్కు వేరే పదవి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. బూడిద భిక్షమయ్య పార్టీ వీడిన తర్వాత.. కాంగ్రెస్కు బలమైన నేత ఎవరూ లేకుండా పోయారు. కల్లూరి రామచంద్రారెడ్డి, బండ్రు శోభారాణి, బోరెడ్డి అయోధ్యరెడ్డి హస్తం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తన మనిషిగా బీర్ల అయిలయ్యను ముందుంచే అవకాశం ఉంది. బీజేపీ నుంచి కాసం వెంకటేశ్వర్లు, పడాల శ్రీనివాస్, ఒట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే సాగనుంది.
జనగామలో ముత్తిరెడ్డిపై ఆరోపణలు పోచంపల్లికి కలిసి వచ్చేనా….
జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై రకరకాల ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ముత్తిరెడ్డిని ఈసారి మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేటీఆర్కు సన్నిహితుడిగా ఉండటం, ముత్తిరెడ్డిపై ఆరోపణలు పోచంపల్లికి కలిసి వచ్చే చాన్స్ ఉంది. ఇప్పటికే కేడర్ను కలుపుకుంటూ తెర వెనక పనిచేసుకుంటున్నారు పోచంపల్లి. అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాకే.. పోచంపల్లి ఫోకస్ పెంచినట్లు సమాచారం. కాంగ్రెస్లో వర్గపోరు సమస్యగా మారింది. పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కొమ్మూరికి ఈసారి టికెట్ దక్కే చాన్స్ ఉందన్న ప్రచారం బలంగా ఉంది. జంగా రాఘవరెడ్డి వరంగల్ పశ్చిమ వైపు మొగ్గు చూపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఇక బీజేపీ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులు ఆరుట్ల దశవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాడిపల్లి ప్రేమలతారెడ్డి పేర్లు వినినిపిస్తున్నాయ్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీని ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పోటీలోకి నిలుపుతారనే ప్రచారం సాగుతోంది.
READ ALSO : Adilabad Lok Sabha Constituency : రాజకీయాలకు అడ్డాగా కుమ్రం భీమ్ పోరుగడ్డ… అదిలాబాద్ పై కన్నేసిన కమలం
.
ఇబ్రహీంపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మరోసారి టిక్కెట్ ఖాయమా….
హైదరాబాద్కు ఆనుకొని ఉండే ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా కిషన్ రెడ్డికే వస్తుందని ఆయన అనుచరులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అయితే మరో సీనియర్ నేత క్యామ మల్లేష్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మల్రెడ్డి రంగారెడ్డితో పాటు మర్రి నిరంజన్ రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయ్. దండెం రాంరెడ్డి, కొత్తకూర్మ శివకుమార్ కూడా హస్తం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. సామాజిక న్యాయం పేరుతో కాంగ్రెస్లో రాజకీయాలు నడుస్తున్నాయ్. బీజేపీ నుంచి కొత్త అశోక్ గౌడ్, నోముల దయానంద్ గౌడ్తో పాటు ఇటీవలే పార్టీలో చేరి చురుగ్గా పనిచేస్తున్న రాణిరుద్రమ కూడా.. ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అర్బన్ నియోజకవర్గం కావడంతో ఇక్కడ పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
కోమటిరెడ్డి సోదరులకు కంచుకోటగా ఉన్న భువనగిరి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ను వర్గపోరు తీవ్రంగా వేధిస్తోంది. గత ఎన్నికల్లో అంతంతమాత్రం మెజారిటీతో భువనగిరి పార్లమెంట్ స్థానంలో బయపడిన కాంగ్రెస్.. ఈసారి కఠినమైన పరిస్థితులు కనిపిస్తున్నాయ్. భువనగిరి పార్లమెంట్ పరిధిలో 2018 ఎన్నికల్లో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. 4చోట్ల బీఆర్ఎస్ గెలిచింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో.. మునుగోడు మినహా నకిరేకల్, ఇబ్రహింపట్నం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. మునుగోడును కూడా ఉపఎన్నికల్లో గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. భువనగిరి లోక్సభ స్థానం కాంగ్రెస్ చేతిలో ఉండగా… ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కారు ఖాతాలోనే చేరిపోయాయ్. ప్రస్తుత పరిణామాల మధ్య.. ఈసారి ఎంపీతో పాటు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను క్లీన్స్వీప్ చేస్తామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తమ పట్టును నిలుపుకునేందుకు తంటాలు పడుతుండగా… మునుగోడు, ఇబ్రహీంపట్నం, జనగామతో పాటు లోక్సభ స్థానంలో పాగా వేసేందుకు కమలనాథులు పావులు కదుపుతున్నారు.
.