Bandi Sanjay : లీగల్ నోటీసులపై న్యాయ పోరాటం చేస్తాం, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు : బండి సంజయ్

తెలంగాణ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీస్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ‘నీ పరువుకే రూ.100 కోట్లయితే.. 30 లక్షల మంది భవిష్యత్ ప్రశ్నార్థకమైందని, మరి వాళ్లకు ఎంత మూల్యం చెల్లిస్తావు’ అని ప్రశ్నించారు.

Bandi Sanjay : లీగల్ నోటీసులపై న్యాయ పోరాటం చేస్తాం, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు : బండి సంజయ్

Bandi Sanjay

Bandi Sanjay : తెలంగాణ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీస్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ‘నీ పరువుకే రూ.100 కోట్లయితే.. 30 లక్షల మంది భవిష్యత్ ప్రశ్నార్థకమైందని, మరి వాళ్లకు ఎంత మూల్యం చెల్లిస్తావు’ అని ప్రశ్నించారు. లీకేజీలో తన కుట్ర ఉందన్న కేటీఆర్ పై ఎంత దావా వేయాలని నిలదీశారు. కేటీఆర్ ఉడుత ఊపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. అమెరికాలో చిప్పలు కడిగేటోడికి వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నోటీసులపై లీగల్ గానే ఎదుర్కొంటామని చెప్పారు. కేసీఆర్ కొడుకు(కేటీఆర్)ను బర్తరఫ్ చేసేదాకా పోరాడతామని పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జిపై విచారణ జరపాల్సిందేనని, నిరుద్యోగులకు రూ.లక్ష ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు (కేటీఆర్) పరువు ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని తనకు లీగల్ నోటీస్ జారీ చేసినట్లు వచ్చిన వార్తలను పత్రికల్లో చూశానని తెలిపారు. లీగల్ నోటీసులపై న్యాయపరంగానే పోరాడతామని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు.  కేసీఆర్ కొడుకును ఒకటే అడగదల్చుకున్నా.. తెలంగాణ ఉద్యమానికి ముందు అమెరికాలో చిప్పలు కడిగే స్థాయి నుండి నేడు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ కొడుకు పరువు, ప్రతిష్ట విలువ ప్రస్తుతం రూ. 100 కోట్లయితే…తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 30 లక్షల మంది యువత భవిష్యత్ మీ పాలన వల్ల ప్రశ్నార్థమైందన్నారు. మరి వారికెంత మూల్యం చెల్లిస్తారో చెప్పాలని నిలదీశారు.

TSPSC paper leak: రూ.100 కోట్ల మేర దావా… రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసులు

పరువు నష్టం పేరుతో కూడా డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ కొడుకు ఒక స్వయం ప్రకటిత మేధావని, నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగానే అపరజ్ఞానిలా భావిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే తట్టుకోలేని మూర్ఖుడని, పాలనలోని తప్పులను ఎత్తిచూపితే సహించలేని అజ్ఞాని అని విమర్శించారు. మీ పాలనలో భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని ఆందోళన చేస్తే.. లాఠీలతో కొట్టించి, కేసులు పెట్టి జైలుకు పంపిన దుర్మార్గుడని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి స్థాయిని, వయసును కూడా చూడకుండా విమర్శించడం కేసీఆర్ కొడుకు కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాన్ని ఒక సాధారణ అంశంగా మలిచేందుకు మంత్రులంతా ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. సిట్ విచారణ అంశాలు అసలు కేటీఆర్ కి ఎలా లీక్ అవుతున్నాయని ప్రశ్నించారు.

మొదట ఇద్దరు మాత్రమే నిందితులన్న కేసీఆర్ కొడుకు పదుల సంఖ్యలో నిందితుల అరెస్టులు జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. ఇద్దరు మాత్రమే దోషులంటూ సర్టిఫికెట్ ఇస్తూ కేసును నీరుగార్చేందుకు యత్నించిన కేసీఆర్ కొడుకుపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదో పోలీసులు సమాధానం చెప్పాలన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ విచారణను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నందుకు సిట్ ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. జవాబివ్వకుండా తప్పిదాలను ప్రశ్నిస్తున్న తమపై చర్యలు తీసుకుంటామంటూ బెదిరిస్తారా? సిట్ బెదిరింపులకు బెదిరేది లేదని తేల్చి చెప్పారు. తాను మళ్లీ చెబుతున్నా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ కుంభకోణం నుండి నేటి ప్రశ్నాపత్రాలు లీకేజ్ వరకు ఐటి శాఖ మంత్రి కేటీఆరే బాధ్యత వహించాలన్నారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్ కు సిట్ నోటీసులు

నాలాలో పడి పిల్లలు చనిపోయిన దగ్గర నుండి కుక్కల దాడిలో పసిపిల్లల చావు వరకు మున్సిపాలిటీ శాఖ మంత్రే బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు. కేసీఆర్ కొడుకును మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే దాకా, నష్టపోయిన నిరుద్యోగులకు రూ. లక్ష చొప్పన పరిహారం అందించే వరకు బీజేపీ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.