రూ.5 కోట్ల లంచం కేసులో ఈడీ మాజీ అధికారి బొల్లినేని గాంధీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

  • Published By: naveen ,Published On : October 6, 2020 / 01:30 PM IST
రూ.5 కోట్ల లంచం కేసులో ఈడీ మాజీ అధికారి బొల్లినేని గాంధీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

bollineni srinivas gandhi: 5 కోట్ల లంచం కేసులో ఈడీ మాజీ అధికారి బొల్లినేని గాంధీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇన్‌పుట్‌ క్రెడిట్స్‌ మంజూరు కోసం లంచం తీసుకుంటూ బొల్లినేని సీబీఐకి అడ్డంగా దొరికిపోయాడు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించింది సీబీఐ. బాధితుల నుంచి 10 లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు ఆధారాలు సేకరించింది. బాధితుడితో నిందితుల ఆడియో, వీడియో టేపులు సేకరించింది. కేసు నుంచి తప్పించుకునేందుకు బాధితుడు సత్య శ్రీధర్‌ రెడ్డితో.. బొల్లినేని బేరసారాలు ఆడినట్లుగా గుర్తించింది. శ్రీధర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసి అతడి భార్యను వదిలిపెట్టేందుకు బొల్లినేని రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆధారాలు సేకరించి సీబీఐ.

రూ.5 కోట్లు లంచం డిమాండ్:
అవినీతి కేసులో జీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీకి వ్యతిరేకంగా సీబీఐ కీలక సాక్ష్యాలు సేకరించింది. ఈ సాంకేతిక ఆధారాల సాయంతో కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. జీఎస్టీ కమిషనర్‌ చిలుక సుధారాణి, సూపరింటెండెంట్‌ బొల్లినేని శ్రీనివాసగాంధీలు కలిసి ఓ వ్యాపారవేత్త నుంచి రూ.5 కోట్ల లంచం డిమాండ్‌ చేసిన ఫిర్యాదుపై సీబీఐ సెప్టెంబర్‌ 11న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసి అత్యంత కీలకమైన ఆడియో రికార్డులు, పలు ఫొటోలు సంపాదించింది.

ఇందులో బొల్లినేని శ్రీనివాసగాంధీ, చిలుక సుధారాణి, బాధితుడు సత్యశ్రీధర్‌రెడ్డిల సంభాషణల రికార్డులున్నాయని తెలిసింది. వీరు రూ.10 లక్షల లంచం తీసుకుంటుండగా తీసిన పలు ఫొటోలు కూడా సీబీఐ సేకరించిందని సమాచారం. ఈ కాల్స్‌లో లంచం డిమాండ్‌ చేయడం, వాటిని ఎప్పుడు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలో సత్యశ్రీధర్‌రెడ్డికి సూచించిన వ్యవహారం మొత్తం రికార్డయింది.

అసలేం జరిగిందంటే..?
ఇన్ఫినిటీ మెటల్‌ ప్రొడక్ట్స్, దాని అనుబంధ కంపెనీలు అక్రమమార్గంలో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను పొందాయంటూ జీఎస్టీలో కేసు నమోదైంది. కేసులో నిందితుడు జగన్నగారి సత్యశ్రీధర్‌రెడ్డి అరెస్టయి, మార్చి 29న విడుదలయ్యాడు. ఇదే కేసులో వ్యాపార భాగస్వామిగా ఉన్న అతని భార్య అరెస్టు కాకుండా, మొత్తం కేసును నీరుగార్చేందుకు హైదరాబాద్‌ జీఎస్టీ పన్ను ఎగవేత నిరోధక విభాగంలో డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న చిలుక సుధారాణి, అదే విభాగంలో సూపరింటెండెంట్‌గా ఉన్న బొల్లినేని శ్రీనివాసగాంధీలు రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు బాధితుడు సత్యశ్రీధర్‌ కూడా అంగీకరించాడు. అడ్వాన్స్ గా రూ.10 లక్షలు ఏప్రిల్‌ 15న చెల్లించాడు.

రూ.4.90 కోట్ల నగదుకు బదులుగా ఓపెన్‌ ప్లాట్లు:
మిగిలిన రూ.4.90 కోట్ల నగదుకు బదులుగా ఓపెన్‌ ప్లాట్ల రూపంలో ఇవ్వాలని వారు షరతు విధించారు. ఈ లంచం వ్యవహారంలో సీబీఐకి ఉప్పందింది. దీంతో సుధారాణి, బొల్లినేని శ్రీనివాసగాంధీలతోపాటు లంచం విషయాన్ని తమకు చెప్పకుండా దాచినందుకు బాధితుడు సత్యశ్రీధర్‌రెడ్డిపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. ఏడాది కాలంలో బొల్లినేనిపై రెండో కేసు నమోదైంది. 2019లో బొల్లినేనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైన విషయం తెలిసిందే. ఎంపీ సుజనా చౌదరికి సంబంధించిన జీఎస్టీ ట్యాక్స్‌ ఎగవేత కేసును దర్యాప్తు చేసింది సుధారాణి, బొల్లినేని శ్రీనివాస గాంధీలే.