ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష.. యువతిని చితకబాదిన కుటుంబసభ్యులు
boyfriend’s relatives attacked on a young woman : నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో దారుణం జరిగింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష చేస్తున్న యువతిపై.. ప్రియుడు అతడి కుటుంబసభ్యులు దాడి చేశారు.
ఇంటి బయట ఉన్న యువతిని అందరూ కలిసి చితకబాదారు. దీంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆమెను 108లో జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తిరుమల, మనోజ్ గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని మనోజ్ ఆమెకు చెప్పారు. అయితే యువతిని పెళ్లి చేసుకోవద్దని మనోజ్ కుటుంబ సభ్యులు అతన్ని ఒత్తిడి చేశారు. దీంతో పెళ్లి చేసుకోనని మనోజ్ యువతికి చెప్పాడు.
ఈ క్రమంలో నిన్న సాయంత్రం అతడి ఇంటి ముందు యువతి మౌనదీక్షకు కూర్చుంది. దీంతో మనోజ్ బంధువులు, గ్రామస్తులు దాడి చేశారు. అయితే ఘటన అనంతరం ప్రియుడు మనోజ్ అతడి కుటుంబసభ్యులు పరారయ్యారు.
తాను, మనోజ్ అనే వ్యక్తి చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నామని.. ఇద్దరికీ పెళ్లి కూడా జరిపేందుకు పెద్దలు ఒప్పుకున్నారని యువతి చెబుతోంది. అయితే కుటుంబసభ్యుల ఒత్తిడితో మనోజ్ తనను పెళ్లి చేసుకోనని చెప్పి వెళ్లిపోయాడని.. అందుకే అతని ఇంటి ముందు మౌన దీక్షకు దిగానని బాధితురాలు వాపోయింది.
తామిద్దరం కలిసి తిరిగిన ఫోటోలను చూపిస్తానని మీడియాకు తెలిపింది. తనకు మనోజ్తో వివాహం జరిపించాలని వేడుకుంటోంది. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా మనోజ్, అతని బంధువులు ఎక్కడున్నారో ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు.