Nirmal: కేసీఆర్ సభకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గైర్హాజరు.. 9న కాంగ్రెస్ పార్టీలోకి?
మరోసారి నిర్మల్ స్థానం నుంచే ఇంద్రకరణ్ రెడ్డి పోటీ చేయడం ఖరారైంది. ఈ నేపథ్యంలో...
Nirmal – Srihari Rao: తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్(BRS party)లో వర్గపోరు తీవ్రతరమవుతోందన్న ఊహాగానాల మధ్య ఇవాళ మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ (KCR) నిర్మల్ లో నిర్వహించిన సభకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత శ్రీహరి రావు గైర్హాజరయ్యారు.
కేసీఆర్ సభ ఉన్నప్పటికీ శ్రీహరి రావు నిర్మల్ నుంచి హైదరాబాద్ వెళ్లారు. ఈ నెల 9న శ్రీహరి రావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బహిరంగగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు శ్రీహరి రావు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా శ్రీహరి రావు వ్యవహరించారు.
గత బహిరంగ సభల్లో ప్రతిసారి శ్రీహరి రావుతో తన అనుబంధాన్ని పంచుకున్నారు కేసీఆర్. ఇవాళ నిర్వహించిన సభకు మరో అసంతృప్త నేత సత్యనారాయణ గౌడ్ మాత్రం హాజరయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ చేసి గెలిచారు ఇంద్రకరణ్ రెడ్డి. ఇప్పుడు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు.
మరోసారి ఆ స్థానం నుంచే ఇంద్రకరణ్ రెడ్డి పోటీ చేయడం ఖరారైంది. ఇంద్రకరణ్పై శ్రీహరి రావు తిరుగు బాటు ధోరణిని కనబర్చుతుండడంతో నిర్మల్ బీఆర్ఎస్లో వర్గపోరు పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ఉద్యమకారులను ఇంద్రకరణ్ పట్టించుకోవడం లేదని కొన్ని రోజుల క్రితమే శ్రీహరి రావు అన్నారు.
CM KCR: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ప్రజలు అందరూ ఈ పని చేయాలి: సీఎం కేసీఆర్