Cabinet meeting: ఏడు గంటల పాటు కేబినెట్.. ఏడేండ్లలో వ్యవసాయంలో ఎన్నో విజయాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్‌లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Cabinet meeting: ఏడు గంటల పాటు కేబినెట్.. ఏడేండ్లలో వ్యవసాయంలో ఎన్నో విజయాలు

Kcr

Telangana Cabinet meeting: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్‌లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా వ్యవసాయ శాఖకు సంబంధించిన విషయాలపై కేబినెట్ చర్చ జరిగింది.

వ్యవసాయ రంగం పై చర్చ:
గత సంవత్సర కాలంలో వ్యవసాయ రంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు, తదితర విషయాలను, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కార్యదర్శి, అధికారులు కేబినెట్‌కు సమగ్రంగా వివరించారు. ప్రస్తుతం వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో, విత్తనాలు ఎరువుల లభ్యత, వర్షాపాతం తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది.

గత పాలనలో తెలంగాణలో వ్యవసాయం తీరు ఎట్లుండె.. నేటి స్వయం పాలనలో ఎట్లున్నది.. అనే విషయాలను ముఖ్యమంత్రి కెసిఆర్ కేబినెట్ సమావేశంలో చర్చించారు. గత ఏడేండ్ల అనతికాలంలో తెలంగాణ వ్యవసాయ ప్రస్థానం, సాధించిన ఘన విజయాలను ముఖ్యమంత్రి ప్రస్థావించారు. ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్తును అందించడంతో పాటు, అనేక కష్టాలకోర్చి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో, నదీజలాలను చెరువులకు కుంటలకు, బీడు భూములకు ప్రభుత్వం మల్లించిందని అన్నారు.

ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఒక్క ఎకరమూ వదలకుండా, వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను రైతులు సాగుచేయడం ప్రారంభించారని అన్నారు. దాంతో పెద్దఎత్తున రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. అదే సమయంలో ప్రభుత్వం రైతులకు అందిస్తున్నపంట పెట్టుబడి సాయం రైతుబంధు సహా సకాలంలో ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉంచడం, తదితర వ్యవసాయ రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని సీఎం అన్నారు.

ఇట్లా అన్ని రకాల చర్యల ఫలితంగా, గత సంవత్సరం 3 కోట్ల టన్నుల ధాన్యం తెలంగాణలో, రికార్డు స్థాయిలో ఉత్పత్తి జరిగిందన్నారు. దాంతోపాటు రైతుకు ఎటువంటి కష్టాలు రాకుండా కరోనా కష్ట కాలంలో గ్రామాల్లోకి వెల్లి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు.

తెలంగాణ రైతులు మరింత ఉత్సాహంతో వరిధాన్యాన్ని పండించే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని, వచ్చే సంవత్సరం ధాన్యం ఉత్పత్తి మరింతగా పెరిగే అవకాశాలున్నాయని కేబినెట్ అంచనా వేసింది. అందుకు అనుగుణంగా ధాన్యం నిలువ చేయడం, మార్కెటింగ్ చేయడంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

ప్రస్తుత వానాకాలం, కోటీ నలభై లక్షల ఎకరాల్లో వ్యవసాయ సాగు జరగనున్నదని, వరి, పత్తి పంటలు రికార్డు స్థాయిలో దిగుబడి సాధించనున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో ఉన్న ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. రైస్ మిల్లులలో మిల్లింగ్ సమార్ద్యాన్ని పెంచుకోవాలని, నూతనంగా రైస్ మిల్లులు పారాబాయిల్డ్ మిల్లులను గణనీయంగా స్థాపించాలని, అందుకు సంబంధించి అత్యంత క్రియాశీలకంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖను కేబినెట్ ఆదేశించింది.

రైతులకు సమగ్రంగా శిక్షణ ఇవ్వడానికి కావాలసిన అన్ని సౌకర్యాలను వ్యవసాయ శాఖ కల్పించాలని, ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగాలని కేబినెట్ స్పష్టం చేసింది. ఉద్యానవన శాఖను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చాలని అందుకు అవసరమైన రీతిలో అధికారులను నిపుణులను జోడించి నిరంతరం రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.

పౌర సరఫరాల శాఖ సహా వ్యవసాయ శాఖలో ఎటువంటి ఉద్యోగాలు ఖాళీలు ఉండకూడదని, అన్ని పోస్టులను నింపుకోవాలని కేబినెట్ ఆదేశించింది. పండిన ధాన్యాన్ని పండినట్టే ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా మిల్లింగ్ చేసి ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి సరఫరా చేయాలన్నది. ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. అందుకు అవసరమైతే సంబంధిత రంగంలో నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలని కేబినెట్ సూచించింది. నూతనంగా ముందుకు వచ్చే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలని మంత్రి మండలి అధికారులను ఆదేశించింది.