కరోనా వైద్యానికి ఆ ఫీజు గిట్టుబాటు కాదు, ప్రభుత్వానికి తేల్చి చెప్పిన ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

  • Published By: naveen ,Published On : August 20, 2020 / 11:38 AM IST
కరోనా వైద్యానికి ఆ ఫీజు గిట్టుబాటు కాదు, ప్రభుత్వానికి తేల్చి చెప్పిన ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

Covid-19 treatment: ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యానికి ఇంతే ఫీజు వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకన్నా ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 14 రోజుల వైద్యానికి గరిష్టంగా రూ.4 లక్షలే వసూలు చేయాలని చెప్పింది. దీనిపై ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు గగ్గోలు పెడుతున్నాయి. ఆ ఫీజుతో వైద్యం చేయడం తమకు గిట్టుబాటు కాదంటున్నాయి.



ఆ ఫీజుతో వైద్యం అసాధ్యం:
ప్రభుత్వం విధించిన ఫీజు సీలింగ్‌ ఆధారంగా కరోనా బాధితులకు వైద్యం చేయడం తమకు సాధ్యం కాదని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. సగం పడకలను ప్రభుత్వానికి అప్పగించేందుకు ఓకే చెప్పాయి. అయితే 14 రోజుల వైద్యానికి గరిష్టంగా రూ.4 లక్షలే వసూలు చేయాలన్న ప్రతిపాదన మాత్రం అసాధ్యమని అంటున్నారు. అది తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. దీనిపై త్వరలో ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలను అందజేస్తామన్నాయి.



రోజుకి ఇంత ఫీజే వసూలు చేయాలి:
ప్రైవేట్, కార్పొరేట్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ఎంత ఫీజు వసూలు చేయాలన్న దానిపై గతంలో ప్రభుత్వం ఒక జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. రోజుకు సాధారణ వార్డులో కరోనా చికిత్స పొందే వ్యక్తి నుంచి రూ.4 వేలు, ఆక్సిజన్‌ వార్డు అయితే రూ.7,500, ఐసీయూలో అయితే రూ.9వేల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. పీపీఈ కిట్లు, మందులు, ఇతరత్రా వసూలు చేసుకోవచ్చని చెప్పింది.



14 రోజులకు గరిష్టంగా రూ.4లక్షలే వసూలు చేయాలి:
కానీ సర్కార్‌ నిర్ణయాన్ని ఏ ఆసుపత్రీ అమలు చేయడం లేదని బాధితుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సగం పడకలను తమకు అప్పగించాలని ఇటీవల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలతో జరిగిన సమావేశంలో వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. అందుకు వారూ అంగీకరించారు. తర్వాత ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్‌ శ్రీనివాసరావుతో జరిగిన సమావేశంలో సగం పడకలకు ఎంత వసూలు చేయాలన్న దానిపై ఒక సీలింగ్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. 14 రోజులకు అన్నీ కలిపి సాధారణ పడకలకు రూ.లక్ష, ఆక్సిజన్‌ బెడ్‌కు రూ.2లక్షలు, ఐసీయూ పడకలకు రూ.3 లక్షల నుంచి రూ.4లక్షల వరకు వసూలు చేయాలని సీలింగ్‌ విధించింది. ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేసుకొని రావాలని కోరింది. కానీ ఇప్పటికీ దీనిపై సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎలాంటి నిర్ణయమూ ప్రభుత్వానికి ప్రతిపాదించలేదు. దీనిపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.



ఆ ఫీజుతో సగం కరోనా పడకలను సర్కారుకు ఇవ్వలేం:
కాగా, సర్కారు సీలింగ్‌ మేరకు సగం పడకలు ఇవ్వడం తమకు గిట్టుబాటు కాదని, కొత్త సీలింగ్‌ ఫీజులను ప్రభుత్వానికి త్వరలో ప్రతిపాదిస్తామని ఆసుపత్రుల ప్రతినిధి ఒకరు తెలిపారు. బాధితులకు ఇతరత్రా అనారోగ్య సమస్యలుంటే చేయాల్సిన టెస్టులు.. అత్యవసర మందులకు అధిక ఖర్చు అవుతుందని, తమకు వాస్తవంగా అయ్యే ఖర్చును ఆధారం చేసుకొని ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు.