Online Cheating: ఆన్లైన్ మోసంలో పోగొట్టుకున్న డబ్బు తిరిగొచ్చింది
సైబర్ మోసాల్లో పోగొట్టుకున్న డబ్బు తిరిగిరాదనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Online Cheating: సైబర్ మోసాల్లో పోగొట్టుకున్న డబ్బు తిరిగిరాదనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాధితులు పోలీసులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతారు. మోసం చేసినవారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. కొన్ని కేసుల్లో కేటుగాళ్లను పట్టుకుంటారు. కానీ ఓ కేసులో ఆన్లైన్లో పోగొట్టుకున్న డబ్బును వెనక్కి తెప్పించారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. ఆన్లైన్ గేమ్స్లో ఓ రిటైర్డ్ ఎస్ఐపై మనవడు రూ. 11 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆన్లైన్ క్లాసుల కోసం రిటైర్డ్ ఎస్ఐ అలీ తన మనవడికి ఫోన్ కొనిచ్చారు. క్లాసుల మధ్యలో వచ్చే గేమింగ్ యాడ్ను క్లిక్ చేయడంతో సెల్ ఫోన్కు అనుసంధానంగా ఉన్న అలీ బ్యాంకు ఖాతా నుంచి 11 లక్షల రూపాయలు ఖాళీ అయ్యాయి. విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు ఖంగుతిన్నారు.
దీంతో బాధితుడు అలీ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆ గేమింగ్ యాడ్ సింగపూర్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. కంపెనీతో మాట్లాడిన సైబరాబాద్ పోలీసులు.. అలీ పోగొట్టుకున్న డబ్బును అతని అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యేలా చేశారు. దీంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. సైబర్ మోసాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని అలీ కోరారు.