సింగరేణిలో కారుణ్య నియామకాలపై సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
సింగరేణిలో కారుణ్య నియామకాలపై సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. సోమవారం(సెప్టెంబర్ 14,2020) అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. అర్హత ఉన్న వారికి కచ్చితంగా ఉద్యోగం ఇస్తామన్నారు. చదువుకు సమాన స్థాయి ఉద్యోగాలు ఖాళీ అయినప్పుడు నియమిస్తామన్నారు. పోస్టులు సృష్టించి ఇవ్వబడవని సీఎం స్పష్టం చేశారు.
సంస్థ మంచి, చెడులు వారికి తెలియాలి. ఈ క్రమంలో వారిని తక్షణమే జనరల్ మజ్దూర్ గా తీసుకుంటాం. కొద్ది రోజులు వారికి శిక్షణ ఇచ్చి అప్గ్రేడ్ చేసి పోస్టులోకి తీసుకుంటాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. అలాగే సింగరేణి కార్మికులకు ఇన్కం ట్యాక్స్ రద్దు చేయాలని ప్రధాని మోడీని అనేకసార్లు కోరామని కేసీఆర్ తెలిపారు. కానీ కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.
https://10tv.in/trs-govt-will-not-consider-tenant-system-of-farmers-in-telangana-govt/
సింగరేణి కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రిటైర్ అయిన సింగరేణి కార్మికులను గౌరవించాలని, పదవీ విరమణ చేసి రోజునే అన్ని ఇచ్చి గౌరవంగా పంపాలని సీఎం కేసీఆర్ సూచించారు. కారుణ్య నియామకాలు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూస్తామని సీఎం తేల్చి చెప్పారు.
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అనేక హక్కులను ఇప్పించడంతోపాటు పలు సంక్షేమ ఫలాలను అందించిందని, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు బి వెంకట్రావ్ అన్నారు. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో పలుమార్లు సీఎం కేసీఆర్ను కలిసి సింగరేణి కార్మికుల సమస్యలను ప్రస్తావించామన్నారు. సానుకూలంగా స్పందించి అనేక సంక్షేమ సర్క్యులర్లను సింగరేణి యాజమాన్యంచే జారీ చేయించి అమలు చేయించారన్నారు.
ఆ ఫలాలు ఇప్పుడు సింగరేణి కార్మికులు పొందుతున్నారన్నారు. త్వరలోనే ఒకటి రెండ్రోజుల్లో కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కేసీఆర్ను కలిసి లాభాల బోనస్ను వచ్చే దసరా ముందే ఇప్పిస్తామన్నారు.