యాదాద్రిలో రోడ్డు విస్తరణలో ఇల్లు, షాపులు కోల్పోయిన వారికి స్థలాలు

యాదాద్రిలో రోడ్డు విస్తరణలో ఇల్లు, షాపులు కోల్పోయిన వారికి స్థలాలు

Yadadri temple reconstruction works : యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. రింగ్ రోడ్డు, మెయిన్ రోడ్డు విస్తరణలో నివాసాలు కోల్పోయే వారితో సీఎం మాట్లాడారు. యాదాద్రి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇల్లు, దుకాణాలు పోతుంటే తనకు చాలా బాధగా ఉందన్నారు. రోడ్డు విస్తరణకు ఎంత స్థలం అవసరమో అంత ఇవ్వాలని కోరారు.

ఇల్లు, షాపులు కోల్పోయిన వారికి 200 గజాల ఇంటి స్థలం.. పుష్కరిణి, కళ్యాణకట్ట ప్రాంతంలో షాప్ నిర్వహణకు స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చుతో పట్టాతోపాటు షాపుల నిర్మాణం చేయించి ఇస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు.

తుది దశలో ఉన్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను ఇవాళ సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. ప్రధానాలయ ప్రాంగణంలో కలియ తిరుగుతూ స్థపతి ఆనందాచారి వేలు, ఆనంద్‌సాయిని నిర్మాణ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాడ వీధులు, ప్రాకార మండపాలు, దర్శన సముదాయాలను, తూర్పు రాజగోపురం, బ్రహ్మోత్సవ మండపం, అద్దాల మండపాలను పరిశీలించిన సీఎం.. అధికారులకు పలు సూచనలు చేశారు.

ఇక ఇప్పటికే 13 సార్లు ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం.. గత పర్యటనల సందర్భంగా చేసిన సూచనల మేరకు పనులు జరిగాయా.. ఇంకా పూర్తి కావాల్సి ఉన్నాయా అన్నది తెలుసుకున్నారు. జరుగుతున్న పనులు, ఇంకా పెండింగ్‌లో ఉన్న పనుల గురించి తెలుసుకొని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఇక అంతకుముందు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో ప్రత్యేక పూజల అనంతరం.. అర్చకులు కేసీఆర్‌కు తీర్థప్రసాదాలు, వేదాశీర్వచనం అందజేశారు. పూజల అనంతరం ఆలయాన్ని అనువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రీశుడి ఆలయ పనులపై ఆరా తీశారు.