water dispute : కేంద్రానికి CM Kcr లేఖాస్త్రం

  • Published By: madhu ,Published On : October 3, 2020 / 07:22 AM IST
water dispute : కేంద్రానికి CM Kcr లేఖాస్త్రం

water dispute : కృష్ణా – గోదావరీ నదీ జలాల వినియోగం విషయంలో ఏపీ అనుసరిస్తున్న తీరును, ఏడేళ్లుగా మౌనం వహిస్తున్న కేంద్రం వైఖరిని తప్పుపడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేఖాస్త్రాన్ని సంధించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు 14 పేజీలతో లేఖ రాశారు.



కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటాలకు సంబంధించి వివరాలను పొందుపరిచారు. అంతర్జాతీయ, జాతీయ, అంతర్ రాష్ట్ర జలన్యాయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి 60 సంవత్సరాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాలను పునః పరిశీలించి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ఎత్తిపడుతూ కేంద్రానికి ఈ లేఖను ఎక్కుపెట్టారు.



అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం 1956 సెక్షన్-3 కింద తెలంగాణ ఫిర్యాదును ఏడేళ్లుగా ట్రిబ్యునల్ కు నివేదించకుండా కేంద్రం తాత్సారం చేయడాన్ని సీఎం కేసీఆర్ ఈ లేఖలో ఎత్తిచూపారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను తెలంగాణ ఇప్పటిదాకా పొందలేకపోయిందని, రెండు రాష్ట్రాల మధ్య జల పంపిణీని సుగమం చేసే బదులు.. కేంద్రం వైఖరి వివాదాలకు ఆజ్యం పోసిందని కేసీఆర్ ఈ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.



తక్షణమే తమ ఫిర్యాదును సెక్షన్-3 క్రింద నివేదించాలని ముఖ్యమంత్రి ఈ లేఖ ద్వారా కేంద్రాన్ని కోరారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా జలాలను కృష్ణా బేసిన్ అవతల ఉన్న ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలించుకుపోతుంటే కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు ఏం చేస్తున్నదని లేఖలో నిలదీశారు. తక్షణమే పోతిరెడ్డిపాడు నుంచి అక్రమ నీటి తరలింపును ఆపడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో కోరారు.



శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు అవసరమైన సాగునీటితో పాటు, హైదరాబాద్ నగరానికి తాగునీటి కోసం ఇబ్బందులు రాకుండా చూడాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.



తెలంగాణ రాష్ట్రం గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ సర్కార్ ఫిర్యాదు చేయడాన్ని ఈ లేఖలో కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రం గోదావరి జలాల్లో తెలంగాణకు కేటాయించిన 967.94 టీఎంసీలలో నుంచే ఈ ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగించుకుంటున్నామని, ఇవేవీ కొత్తవి కావని లేఖలో పేర్కొన్నారు.



తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదు, పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం సహా వారు అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై దృష్టిని మరలించడానికి వేసిన ఎత్తుగడగానే తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు. గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులేవీ కొత్తవి కావని, అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రారంభించినవేనని సీఎం కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖలో ఆధారాలతో సహా వివరించారు.