CM KCR : మూడు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన, షెడ్యూల్ ఖరారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. 2021, జూన్ 20వ తేదీ ఆదివారం సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. రెండు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభిస్తారు.
CM KCR Tour : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. 2021, జూన్ 20వ తేదీ ఆదివారం సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. రెండు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభిస్తారు. సిద్ధిపేటలో పోలీస్ కమిషనరేట్, కామారెడ్డిలో డీపీఓ కార్యాలయ భవనాలనూ ఆయన ప్రారంభించనున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయన పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు సైతం చేసే అవకాశముంది.
ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సిద్ధిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. సిద్దిపేట జిల్లా కార్యాలయాల సముదాయం భవనంతోపాటు పోలీస్ కమిషనరేట్, సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు, పోలీస్ యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా ఏర్పాట్లను పరిశీలించారు.
సిద్ధిపేటలో నాలుగెకరాల విస్తీర్ణంలో 62 కోట్ల 60 లక్షలతో ఈ నూతన భవన సముదాయాన్ని నిర్మించారు. రెండంతస్తుల భవనంలో 600 మంది ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు వసతులు కల్పించారు.. 40 శాఖలకు 100 గదులను కేటాయించారు. ఇక సిద్దిపేట శివారులో 29 ఎకరాల్లో 19 కోట్లు వెచ్చించి జిల్లా పోలీస్ కమిషనరేట్ను నిర్మించారు. అత్యాధునిక హంగులతో, సాంకేతికత, వసతులతో ఈ భవనాన్ని నిర్మించారు. సిద్దిపేట నుంచి సీఎం కేసీఆర్ నేరుగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్తారు. అక్కడ నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించనున్నారు. రెండంతస్తుల ఈ భవనంలో 60 ప్రభుత్వ శాఖలను ఒకే విధంగా ఉండేలా నిర్మించారు.. ఇక 31 ఎకరాల్లో నిర్మించిన పోలీస్ కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
సీఎం కేసీఆర్ సోమవారం వరంగల్లో పర్యటించనున్నారు. కూల్చివేసిన సెంట్రల్ జైలు స్థానంలో.. కొత్తగా నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు శంకుస్థాపన చేయనున్నారు.. ఈ ఆసుపత్రిని 30 అంతస్తుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. వరంగల్ పర్యటన అనంతరం యాదాద్రికి బయల్దేరి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. 22న తాను దత్తత తీసుకున్న వాసాలమర్రికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడనున్నారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నారు కేసీఆర్.