కరంటోళ్లకు కంగ్రాట్స్ : విద్యుత్ శాఖపై కేసీఆర్ ప్రశంసలు
కరోనా వైరస్పై పోరుకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పేసినా విద్యుత్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండాచేసిన విద్యుత్శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. అంచనావేసిన దానికన్నా భారీగా డిమాండ్ పడిపోయినప్పటికీ, వ్యూహాత్మకంగా బ్యాలెన్స్చేయగలిగారని ప్రశంసించారు. రాత్రి 9 గంటలకు ఒకేసారి విద్యుత్ దీపాలు ఆర్పేసినప్పటికీ విద్యుత్ శాఖ పక్కావ్యూహంతో వ్యవహరించింది.
ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాలేదు. విద్యుత్ వినియోగంలో ఒకేసారి భారీ మార్పులు సంభవించినప్పటికీ ఉత్పత్తి-సరఫరా మధ్య పూర్తిస్థాయి సమతూకాన్ని సాధించడంలో జెన్కో, ట్రాన్స్కో విజయం సాధించాయి. విద్యుత్ గ్రిడ్కు ఎలాంటి నష్టం కలుగకుండా చూసేందుకు విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్రావు నిన్న ఉదయం నుంచి విద్యుత్సౌధలోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
రాత్రి 9 గంటల వరకు 7,300 మెగావాట్లున్న విద్యుత్ డిమాండ్.. తర్వాత ఒక్కసారిగా లైట్లు ఆర్పివేయడంతో 5,800 మెగావాట్లకు పడిపోయింది. తగ్గిన 1,500 మెగావాట్ల డిమాండ్ను మెయిన్టెయిన్ చేసేందుకు నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల వద్ద రివర్స్ పంపింగ్ నిర్వహించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలో 120 మెగావాట్ల సామర్థ్యంతో పంపింగ్ కొనసాగించారు. రాత్రి 9 గంటల 9 నిమిషాల తర్వాత రాష్ట్ర ప్రజలంతా మళ్లీ విద్యుత్ దీపాలను వెలిగించగానే రివర్స్ పంపింగ్ను నిలిపివేశారు. దీంతో గ్రిడ్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.
See Also | లాక్ డౌన్ కు ప్రజలు ఎదురు తిరుగుతారు, కేంద్రానికి ఆర్బీఐ మాజీ గవర్నర్ హెచ్చరిక