Corona positive for 20 people : కరీంనగర్ జిల్లా గుడ్డేలుగులపల్లిలో కరోనా కలకలం.. మూడు రోజుల్లో 20 మందికి పాజిటివ్
తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లిలో కరోనా కలకలం రేగింది.
Corona positive for 20 people in three days : తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లిలో కరోనా కలకలం రేగింది. 130 మంది గ్రామస్థులకు కరోనా పరీక్షలు చేయగా.. 20 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రామడుగు పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యాధికారులు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు.
రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో గ్రామస్థలు ఆందోళన చెందుతున్నారు. అయితే గ్రామస్థులు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో కోవిడ్ విజృంభిస్తోంది. నిన్న ఓ ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వగా.. ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా పాఠశాలలోని ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో కొత్తగా 204 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,522కి చేరింది. నిన్న(మార్చి 15,2021) రాత్రి 8 గంటల వరకు 60వేల 263మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24గంటల్లో కొవిడ్తో మరో ఇద్దరు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,656కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం(మార్చి 16,2021) ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
కరోనా నుంచి నిన్న 170 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,97,851కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,015 ఉండగా.. వీరిలో 624 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 37 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 92,99,245మందికి కరోనా పరీక్షలు చేశారు.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజూ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే సోమవారం(మార్చి 15,2021) ఇండియాకు కాస్త రిలీఫ్ దక్కింది. కొత్త కేసులు కాస్త తగ్గాయి. ఆదివారం(మార్చి 14,2021) 26 వేలకుపైగా కేసులు నమోదుకాగా.. నిన్న 24వేల 492 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,09,831కి చేరింది. గడిచిన 24 గంటల్లో 8.73లక్షల కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు.