తీరని విషాదం : ఒకే కుటుంబంలోని ముగ్గురిని చంపేసిన కరోనా

  • Published By: madhu ,Published On : July 30, 2020 / 07:39 AM IST
తీరని విషాదం : ఒకే కుటుంబంలోని ముగ్గురిని చంపేసిన కరోనా

కరోనా ఎంతో మందిని బలి తీసుకొంటోంది. చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా..అందరికీ వైరస్ సోకుతోంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు వైరస్ సోకి చనిపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచర్ల గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి (60), భార్య సుకుమారి (55), కుమారుడితో కలిసి చంపాపేటలోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయన సోదరుడి కుమారుడు అడ్వకేట్‌ అన్‌రెడ్డి హరీష్‌ రెడ్డి (37) తన భార్యాపిల్లలతో కలిసి ఇదే డివిజన్‌లోని రెడ్డి కాలనీలో ఉంటున్నారు.

భూ వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు వీరంతా ఇటీవలే ఒకే కారులో స్థానికంగా ఉన్న పీఎస్ కు వచ్చారు. అనంతరం మూడు రోజులకే హరీష్ రెడ్డికి శ్వాసకోస సంబంధ సమస్యలు తలెత్తాయి. కోవిడ్ పరీక్ష చేయించగా..పాజిటివ్ గా వచ్చింది. ఆయన భార్య, ఐదేళ్ల కూతురికి కూడా పాజిటివ్ వచ్చింది. బాబాయ్ సత్యనారాయణరెడ్డి, పిన్ని సుకుమారి, వారి 21 ఏళ్ల కుమారుడికి వైరస్ వచ్చింది.

జులై మొదటి వారంలో బంజారాహిల్స్ లోని విరించి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ…ఆయన ఈ నెల 23వ తేదీన చనిపోయారు. చికిత్స కోసం రూ. 16 లక్షలు వెచ్చించినట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే..జులై 10వ తేదీన సత్యనారాయణరెడ్డి, సుకుమారిలు సోమాజీగూడలో దెక్కన్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం వీరు హోం ఐసోలేషన్ కు వెళ్లిపోయారు.

కానీ రెండు రోజుల తర్వాత..సత్యనారాయణ రెడ్డికి ఆయాసం, జ్వరంతో బాధ పడుతుండడంతో ఆయన్ను చికిత్స నిమిత్తం జులై 15వ తేదీన మరలా అదే ఆసుపత్రిలో చేరిపించారు. సుకుమారికి కూడా శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిపించారు. శనివారం బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకుని…పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం చనిపోయారు.

దెక్కన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణరెడ్డి కూడా అదే రోజు మరణించారు. దీంతో తల్లిదండ్రులు చనిపోవడంతో కొడుకు కన్నీరుమున్నీరయ్యాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో ఆ కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.