బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఆ నలుగురే కీలకం
CP Anjanikumar introduces the Boinapally kidnappers to the media : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ..మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 19కి చేరింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం (జనవరి 17, 2021)న కిడ్నాపర్లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అఖిలప్రియ పోలీస్ కస్టడీలో వెల్లడించిన సమాచారం ఆధారంగా 15 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. దేవీప్రసాద్, భాను, కృష్ణ వంశీ, అంజయ్య, రవి చంద్ర, చంటి, బానోతు సాయి, దేవరకొండ కృష్ణ, నాగరాజు, శివ ప్రసాద్, మీసాల శ్రీను, షేక్ అరెస్ట్ చేశారు. కిడ్నాప్కు వినియోగించిన వాహనాలు, సెల్ఫోన్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
భూమా అఖిలప్రియ, భార్గవ్రామ్, జగత్ విఖ్యాత్రెడ్డితోపాటు గుంటూరు శీను కలిసి కిడ్నాప్కు పథకం రూపొందించారని సీపీ వెల్లడించారు. ఈ నెల 2న లోధా అపార్ట్మెంట్లో ప్లాన్ చేశారని.. కిడ్నాప్కు ముందు పలుమార్లు రెక్కీ నిర్వహించినట్టు తెలిపారు. బాధితులను సన్ సిటీ దగ్గర వదిలేశారని సీపీ చెప్పారు. కిడ్నాప్కు వాడిన ఇన్నోవా భార్గవరామ్ తల్లిపేరు మీద ఉందని పేర్కొన్నారు. ఈ ఇన్నోవాను జగత్ విఖ్యాత రెడ్డి నడిపాడని సీపీ తెలిపారు.
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో గుంటూరు శ్రీను కీలకపాత్ర పోషించారని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ ప్లాన్ను అమలు చేసేందుకు గుంటూరు శ్రీను.. మాదాల సిద్దార్ధ్ను కలిసినట్టు వెల్లడించారు. మాదాల సిద్దార్ధ్తోపాటు మరో 20మంది ఈ కిడ్నాప్ కోసం అడిగినట్టు తెలిపారు. మాదాల సిద్దార్థ్కు 5 లక్షలు, 20 మందికి 25వేల చొప్పున డబ్బులు ఇచ్చేలా డీల్ కుదిరిందన్నారు. మాదాల సిద్దార్ధ్కు అడ్వాన్స్గా 74వేల రూపాయలు గుంటూరు శ్రీను ఇచ్చినట్టుగా పోలీసులు తెలిపారు. వీరందరినీ కూకట్పల్లిలోని ఎట్హోం అనే లాడ్జ్లో ఉంచారని వివరించారు.
కిడ్నాప్ కోసం వచ్చిన 20 మందికి గుంటూరు శ్రీనే ప్రత్యేకంగా డ్రస్సులు కుట్టించినట్టుగా పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేసిన తర్వాత బాధితులను మెయినాబాద్లోని ఓ ఫామ్హౌస్లో ఉంచి.. వారిచేత బలవంతంగా సంతకాలు తీసుకున్నట్టు వెల్లడించారు. భార్గవ్రామ్, విఖ్యాత్రెడ్డి పేర్లమీద స్టాంప్ పేపర్స్ను తయారు చేయించినట్టు తెలిపారు.
కిడ్నాప్ జరిగినరోజు పలుమార్లు నిందితులు రెక్కీ నిర్వహించినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాతే రాత్రి కిడ్నాప్కు పాల్పడ్డారని తెలిపారు. కిడ్నాప్ కోసం ఐదు వాహనాలు వినియోగించారని.. వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు.