టపాసులు నై : తెలంగాణలో క్రాకర్స్ దుకాణాలు బంద్

  • Published By: madhu ,Published On : November 13, 2020 / 01:24 PM IST
టపాసులు నై : తెలంగాణలో క్రాకర్స్ దుకాణాలు బంద్

Cracker shops closed in Telangana : తెలంగాణ రాష్ట్రంలో క్రాకర్స్ దుకాణాలు మూతపడుతున్నాయి. బాణాసంచాపై నిషేధం విధించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశం ప్రకారం…అమ్మకాలు, వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు 2020, నవంబర్ 13వ తేదీ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టపాసుల దుకాణాలు మూసివేయాలని సూచించింది. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలకు డీజీపీ మహేందర్ రెడ్డి పలు ఆదేశాలు జారీ చేశారు. దుకాణాలను పోలీసులు మూసివేస్తున్నారు.

వ్యాపారస్తుల ఆగ్రహం : – 
ప్రభుత్వ ఆదేశాలపై వ్యాపారస్తులు భగ్గుమంటున్నారు. కోట్లాది రూపాయలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల ముందు చెప్పి ఉంటే బాగుండేదని, ప్రభుత్వ తీరుతో తీవ్రంగా నష్టపోతున్నామని వెల్లడించారు. సరుకు నిల్వ చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. అమ్మలేము, కొనలేము ఇప్పుడెలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఫర్మిషన్ తీసుకుని తాము దుకాణాలు పెట్టుకున్నామని, క్రాకర్స్ తీసుకుని ఎక్కడకు పోవాలంటూ నిలదీస్తున్నారు. ఎక్కడి నుంచో స్టాక్ తీసుకొస్తామని, ప్రస్తుత పరిస్థితుల్లో ఏమి చేయాలంటున్నారు. ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేందంటున్నారు. తాము పెట్టిన ఖర్చులు ఎవరిస్తారు ? వెల్లడిస్తున్నారు.

కోర్టు ఆదేశాలు : – 
క్రాకర్స్‌ బ్యాన్‌ చేయాలంటూ న్యాయవాది ఇంద్రప్రకాశ్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. క్రాకర్స్‌ను కాల్చడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్‌లో తెలిపారు. టపాసుల కారణంగా కాలుష్యం పెరిగి… కరోనా బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, శ్వాస కోశ ఇబ్బందులు తలెత్తుతాయని కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు క్రాకర్స్‌పై ఇప్పటికే బ్యాన్‌ విధించిందని… పలు రాష్ట్రాల హైకోర్టులు కూడా ఇప్పటికే నిషేధించాయనే విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా చర్యలు తీసుకోవాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. ఇప్పటికే తెరిచిన షాపులను వెంటనే మూసివేయడంతో పాటు ఎవరైనా క్రాకర్స్‌ అమ్మితే కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

ముందే చెబితే బాగుండేది : – 
తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై బాణాసంచా వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగకు రెండు రోజుల ముందు టపాసులు బ్యాన్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై ఆందోళన చెందుతున్నారు. ఆ విషయం ముందే చెబితే తాము కోట్ల రూపాయలు పెట్టి సరుకు తెచ్చేవాళ్లం కాదంటున్నారు.