జులై 1 నుంచి డిగ్రీ అడ్మిషన్స్

  • Published By: bheemraj ,Published On : June 22, 2020 / 10:19 PM IST
జులై 1 నుంచి డిగ్రీ అడ్మిషన్స్

రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) సోమవారం (జూన్ 22, 2020) నోటిఫికేషన్‌ జారీ చేసింది. వివిధ వర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులు జూలై 1 నుంచి 14 వరకు రూ. 200 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో( https:// dost.cgg.gov.in) దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. విద్యార్థులు ఇంటర్‌ హాల్‌టికెట్‌ నెంబర్‌తో లాగిన్‌ అయి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చని పేర్కొంది. సోమవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన దోస్త్‌ కమిటీ సమావేశంలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సారి ఒకరినొకరు ముట్టుకోకుండా ఉండేందుకు బయోమెట్రిక్‌కు బదులు రియల్‌టైమ్‌ డిజిటల్‌ ఫేస్‌ రికగ్నైజేషన్‌ టీ–యాప్‌ ఫోలియోను ప్రవేశపెట్టింది. ఇది తెలంగాణ ఇంటర్‌ బోర్డు నుంచి పాసైన విద్యార్థులకే వర్తిస్తుంది. విద్యార్థులు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఇంటర్‌ హాల్‌టికెట్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి, సెల్ఫీ ఫొటో ద్వారా ‘దోస్త్‌’ఐడీని జనరేట్‌ చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్‌ గ్రీవెన్స్‌ కోసం 7901002200 వాట్సాప్‌ చాట్‌బాత్‌ (ఆటో రెస్పాండర్‌)ను ప్రవేశపెట్టింది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ ద్వారా కూడా వివరాలను పొందవచ్చు.

ఇదివరకే ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌గల విద్యార్థులు నేరుగా దోస్త్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఆధార్‌తో మొబైల్‌ నంబర్‌ లింక్‌ కాకపోతే తల్లిదండ్రుల మొబైల్‌ నంబర్‌ను ఆధార్‌తో లింక్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేసుకొనే వెసులుబాటు ఉంది.
విద్యార్థులు టీ–యాప్‌ ఫోలియో యాప్‌ (ఫేషియల్‌ రికగ్నిషన్‌) ద్వారా సెల్ఫీతోనూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ లేని వాళ్లు, ఆధార్‌తో మొబైల్‌ లింక్‌లేని వాళ్లు వారి తల్లిదండ్రుల ఫోన్‌ నెంబర్లు తీసుకొని దోస్త్‌ హెల్త్‌లైన్‌ లేదా దోస్త్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ లేదా మీసేవా సెంటర్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. మొదటిసారి రిజిస్ట్రేషన్‌కు రూ. 200 చెల్లించాలి. 

రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థికి దోస్త్‌ ఐడీ, పిన్‌ నంబర్‌ వస్తుంది. వాటిని ఉపయోగించి దరఖాస్తు ఫారం ఓపెన్‌ చేసి వివరాలు నింపాలి. ఆ తరువాత విద్యార్థులు కోర్సులవారీగా, కాలేజీలవారీగా ప్రాధాన్య క్రమంలో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. కోరుకున్న కాలేజీలో సీటు వస్తే సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ద్వారా విద్యార్థి కన్‌ఫర్మ్‌ చేసుకోవాలి. ఏ దశ కౌన్సెలింగ్‌లో అయినా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ద్వారా సీట్లను కన్‌ఫర్మ్‌ చేసుకున్న విద్యార్థి ఆగస్టు 20 నుంచి 24 మధ్య కాలేజీకి వెళ్లి సర్టిఫికెట్లను సమర్పించి ఫీజు చెల్లించాలి. అప్పుడే ఆ విద్యార్థికి ఆ సీటు ఉంటుంది. మొదటి కౌన్సెలింగ్‌లో విద్యార్థికి వచ్చిన సీటు, కాలేజీ నచ్చకపోయినా సీటు రిజర్వేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో మాత్రమే ఫీజు చెల్లించాలి. ఆ తరువాత తదుపరి దశల కౌన్సెలింగ్‌లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అర్హతగల వారు 2019 ఏప్రిల్‌ 1 లేదా ఆ తరువాత జారీ చేసిన ఆదాయం సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేయాలి. ఈ–సేవా జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్‌ చేయాలి. యూనివర్సిటీ/ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు లభించిన వారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైతే సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు డబ్బలు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పొందిన వారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైతే ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు రూ. 500 చెల్లించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు కాని వారు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ సమయంలో రూ. 1,000 చెల్లించాలి.