Telangana Government : గిరిపుత్రుల అక్షరానికి వారధిగా ప్రభుత్వం..గోండి, లంబాడా భాషల్లో డిక్షనరీలు
తెలంగాణ ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గిరిపుత్రుల అక్షరానికి ప్రభుత్వం వారధి కడుతోంది.
Dictionaries in Gondi and Lambada languages : తెలంగాణ ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గిరిపుత్రుల అక్షరానికి ప్రభుత్వం వారధి కడుతోంది. గిరిజన భాష, సంస్కృతుల పరిరక్షణ, అక్షరాస్యత పెంపునకు మాతృభాషలో బోధన కోసం గోండి, లంబాడా భాషల్లో డిక్షనరీలు రూపొందిస్తోంది.
గోండి భాషా డిక్షనరీ రూపకల్పనలో రాష్ట్ర భాషా నిపుణులతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల భాషా కోవిదులు పాలుపంచుకుంటున్నారని, దాదాపు పూర్తి కావొచ్చిందని టీసీఆర్టీఐ జాయింట్ డైరెక్టర్ వీ సముజ్వల పేర్కొన్నారు. లంబాడా డిక్షనరీని సైతం రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో గిరిజన జనాభా 31,77,940. రాష్ట్రంలో 32 గిరిజన తెగలున్నాయి. వీటిలో కోయ, గోండు, పర్ధాన్, తోటి, కోలామ్, చెంచు, ఎరుకల, కొండరెడ్డి, ఆంధ్ తెగల జనాభా ఎక్కువ. ఇందులో లిపి ఉన్న తెగ గోండి (జనాభా 2,97,846), కోలామ్ (44,805), కోయ (3,81,354), లంబాడా(2,44,039). ఈ నాలుగు తెగలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లోని విద్యార్థుల కోసం గిరిజన సాంస్కృతిక, పరిశోధన, శిక్షణా సంస్థ ఆయా భాషల్లో వాచకాలను రూపొందించింది.
ఆదివాసీ, గిరిజన తెగల సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించేందుకు వీడియోగ్రఫీ చేస్తున్నట్లు గిరిజన సాంస్కృతిక పరిశోధన సంస్థ (టీసీఆర్టీఐ) డైరెక్టర్ వీ.సర్వేశ్వర్రెడ్డి చెప్పారు. పుట్టుక నుంచి చావు వరకు మనిషితో సంబంధం ఉన్న అన్ని అంశాలను క్రోడీకరించి గ్రంథస్తం చేస్తున్నామని టీసీఆర్టీఐ జాయింట్ డైరెక్టర్ వీ సముజ్వల తెలిపారు.