Warangal లో త్వరలో Metro పరుగులు
హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..అందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. త్వరలో వరంగల్ నగర వాసులకు మెట్రో సౌకర్యం కలుగనుంది. మహారాష్ట్ర తరహా మెట్రోనియో ప్రాజెక్టును ఇక్కడ నెలకొల్పాలని భావించింది.
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ‘మహామెట్రో’ డీపీఆర్ (డిటైయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) రెడీ చేస్తున్నారు. మూడు నెలల్లో కార్యరూపం దాల్చనున్నట్లు తెలుస్తోంది. కాజీపేట, పెట్రోల్పంప్, పోచమ్మమైదాన్, వెంకట్రామ టాకీస్ మీదుగా వరంగల్ రైల్వే స్టేషన్ దాకా దాదాపు 15కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టుకు రూ.1200 కోట్ల నుంచి రూ.1400 కోట్ల దాకా కావొచ్చని ‘మహామెట్రో’ ప్రతినిధుల బృందం ప్రాథమికంగా అంచనా వేసింది.
మహారాష్ట్రలోని నాగ్పూర్, థానే, పుణె, నాసిక్ వంటి నగరాల్లో అనుసరించిన మార్గంలోనే ప్రాజెక్టు ప్రతినిధులు గత సంవత్సరం డిసెంబర్లో వరంగల్కు వచ్చి అధ్యయనం చేశారు. సాధ్యమౌతుందా ? లేదా ? అనే దానిపై స్టడీ చేశారు.
వరంగల్ మహానగరంలో ఉండే ట్రాఫిక్, ప్రైవేటు రవాణా ఎలా ఉంటుంది అనే దానిపై అధ్యయనం చేశారు.
మెట్రో వస్తే..ప్రజలు ఆదరిస్తారా ? లేదా ? వారి ఆర్థిక, సామాజిక, వ్యాపార పరిస్థితులపై శాస్త్రీయంగా అధ్యయనం చేస్తూ డీపీఆర్ను రూపొందిస్తున్నారు. మహామెట్రో టెక్నికల్ ఎక్స్పర్ట్ సభ్యులు, పోలీసులు, ఆర్టీఏ, ఆర్టీసీ, మున్సిపల్ కార్పొరేషన్, రైల్వే నెట్వర్క్ వ్యవస్థలపై సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.
రూ.కోటితో డీపీఆర్ను రూపొందిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే రెండు మూడు నెలల్లో డీపీఆర్కు ఒక రూపం వస్తుందంటున్నారు ప్లానింగ్ ఆఫీసర్.