డాక్టర్ హుస్సేన్ సేఫ్, కిడ్నాపర్లను పట్టుకున్న అనంత పోలీసులు

  • Published By: madhu ,Published On : October 28, 2020 / 10:23 AM IST
డాక్టర్ హుస్సేన్ సేఫ్, కిడ్నాపర్లను పట్టుకున్న అనంత పోలీసులు

Dr. Hussein kidnapping case ends : డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యింది. అనంతపురం మీదుగా బెంగుళూరు వెళుతుండగా..కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. మరూర్ టోల్ గేట్ వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద రివాల్వర్, కత్తి, మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.



హైదరాబాద్ ఎక్సైజ్ అకాడమీ వద్ద క్లినిక్ నుంచి తనను కిడ్నాప్ చేశారని, ముందు ఓ గదిలో నిర్భందించి..చిత్ర హింసలకు గురి చేశారని డా.హుస్సేన్ వెల్లడించాడు. కాళ్లు, చేతులు కట్టేసి తీసుకెళ్లారని, అసలు ఎందుకు కిడ్నాప్ చేశారో తనకు తెలియదని తెలిపారు.



కిడ్నాప్‌కు గురైన డాక్టర్‌ హుస్సేన్‌…కిస్మత్‌పూర్‌ ప్రాంతంలోని ప్రెస్టేజ్‌ విల్లాలో నివసిస్తున్నారు. అదే ప్రాంతంలోని ఎక్సైజ్ పోలీస్‌ అకాడమీ పక్క కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పనులు పరిశీలించేందుకు డ్రైవర్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. హుస్సెన్‌ అక్కడికి చేరుకున్న కాసేపటికి…బురఖా వేసుకున్న ఓ ఆరుగురు వ్యక్తులు అపార్ట్‌మెంట్‌ ప్రాంతానికి చేరుకున్నారు.



https://10tv.in/rajendra-nagar-doctor-hussein-kidnap-mystery/
రెండవ అంతస్తులో కార్మికులతో మాట్లాడుతున్న డాక్టర్‌ను బంధించి బలవంతంగా ఆయన కారులోనే తీసుకెళ్లారు. వెంటనే ఈ విషయాన్ని స్పాట్‌లో ఉన్న డ్రైవర్‌, కార్మికులు..డాక్టర్‌ కుటుంబసభ్యులకు తెలిపారు. కుటుంబసభ్యులు 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.



కేసు నమోదు చేసుకున్న పోలీసులు..డాక్టర్‌ కిడ్నాప్‌కు గురైన ప్రదేశానికి చేరుకున్నారు. సీపీ సజ్జనార్ స్వయంగా డాక్టర్ కిడ్నాప్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. చివరకు డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.