TSRTC: ఆన్లైన్ టికెట్ బుకింగ్లో ‘డైనమిక్ ప్రైసింగ్’
ఆన్లైన్ బుకింగ్ విధానం ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన సీటును బుక్ చేసుకోవచ్చని వారు చెప్పారు. సర్వీస్ ప్రారంభమయ్యే గంట ముందు వరకు ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. రద్దీ తక్కువగా ఉన్న రోజుల్లో ప్రయాణికులను ఆకర్శించేందుకు డైనమిక్ ప్రైసింగ్ విధానం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు

'Dynamic Pricing' in TSRTC Online Ticket Booking
TSRTC: ఆన్లైన్ టికెట్ బుకింగ్లో ‘డైనమిక్ ప్రైసింగ్’ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఫైలట్ ప్రాజెక్ట్గా బెంగళూరు మార్గంలో నడిచే 46 సర్వీసుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. హైదరాబాద్లోని బస్ భవన్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో డైనమిక్ ప్రైసింగ్ విధాన వివరాలను టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ , ఎండీ వీసీ సజ్జనర్ సంయుక్తంగా వెల్లడించారు.
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నుంచి బెంగళూరుకు వెళ్లే సర్వీసుల్లో ఈ నెల 27 నుంచి డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. విమానాలు, హోటళ్లు, ప్రైవేట్ బస్ ఆపరేటర్ల బుకింగ్లో ఇప్పటికే అమల్లో ఉన్న డైనమిక్ ప్రైసింగ్ను.. త్వరలోనే ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపాయమున్న సర్వీస్లన్నింటిలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రయాణికుల రద్దీని బట్టి టికెట్ ధరల్లో హెచ్చు తగ్గులు జరగడమే డైనమిక్ ప్రైసింగ్ విధానం. రద్దీ తక్కువగా ఉంటే సాధారణ చార్జీ కంటే తక్కువగా ఈ విధానంలో టికెట్ ధర ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ మేరకు చార్జీలుంటాయి. డైనమిక్ ప్రైసింగ్ విధానంలో అడ్వాన్స్డ్ డేటా అనాలసిస్ అండ్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ మార్కెట్లోని డిమాండ్ను బట్టి చార్జీలను నిర్ణయిస్తాయి. ప్రైవేట్ ఆపరేటర్లు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల బుకింగ్లతో పోల్చి టికెట్ ధరను వెల్లడిస్తాయి.
“సాధారణ రోజుల్లోనూ ప్రైవేట్ ఆపరేటర్లు అధికంగా చార్జీలు వసూలుచేస్తున్నారు. రద్దీ రోజుల్లో అయితే టికెట్ల ధరలు ఇష్టారీతిన పెంచుతున్నారు. ప్రైవేట్ పోటీని తట్టుకుని.. ప్రజలకు మరింతగా చేరువ అయ్యేందుకు ఆన్లైన్ టికెట్ బుకింగ్లో డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ విధానం వల్ల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు సాధారణ చార్జీ కన్నా 20 నుంచి 30 శాతం వరకు టికెట్ ధర తక్కువగా ఉంటుంది. ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే సాధారణ చార్జీ కన్నా డిమాండ్ బట్టి 25 శాతం వరకు ఎక్కువగా టికెట్ ధర ఉంటుంది.” అని బాజిరెడ్డి గోవర్దన్, సజ్జనర్ తెలిపారు.
ఆన్లైన్ బుకింగ్ విధానం ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన సీటును బుక్ చేసుకోవచ్చని వారు చెప్పారు. సర్వీస్ ప్రారంభమయ్యే గంట ముందు వరకు ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. రద్దీ తక్కువగా ఉన్న రోజుల్లో ప్రయాణికులను ఆకర్శించేందుకు డైనమిక్ ప్రైసింగ్ విధానం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం 60 రోజుల వరకు కల్పిస్తున్నామని గుర్తు చేశారు. సంస్థ అధికారిక వెబ్సైట్ www.tsrtconline.in లో టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు. టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన ప్రయాణికులు మంచిగా ఆదరిస్తున్నారని అన్నారు. ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశంతోనే డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు బాజిరెడ్డి గోవర్దన్, వీసీ సజ్జనర్ తెలిపారు.