Nama Nageswara Rao: ఎంపీ నామా ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. నోటిసులు జారీ!
టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో, కంపెనీల్లో ఈడీ సోదాలు ముగిశాయి. ఖమ్మం, హైదరాబాద్లో మొత్తం ఆరు చోట్ల సోదాలు చేసిన ఈడీ, కీలక డాక్యుమెంట్లు, నగదును స్వాధీనం చేసుకుంది.
ED Raids on TRS MP: టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో, కంపెనీల్లో ఈడీ సోదాలు ముగిశాయి. ఖమ్మం, హైదరాబాద్లో మొత్తం ఆరు చోట్ల సోదాలు చేసిన ఈడీ, కీలక డాక్యుమెంట్లు, నగదును స్వాధీనం చేసుకుంది. జూబ్లీహిల్స్లోని నామా నివాసంలో భారీగా నగదు గుర్తించినట్లు తెలుస్తుంది. నామా నాగేశ్వరరావు సమక్షంలో డబ్బు లెక్కింపు కొనసాగింది.
బ్యాంకులను వెయ్యి 64 కోట్లకు మోసం చేసినట్లు వచ్చిన అభియోగాలతో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించగా.. నామాతో పాటు మధుకాన్ డైరెక్టర్ల ఇళ్లలోనూ సెర్చ్ చేశారు అధికారులు. ఆయా సంస్థల అకౌంట్లు, డాక్యుమెంట్లు, కాంట్రాక్టులకు సంబంధించిన సమాచారం తీసుకున్నారు అధికారులు. 2011లో రాంచీ-జంషెడ్పూర్ హైవే కాంట్రాక్ట్ను మధుకాన్ సంస్థ దక్కించుకుంది. ఆ ప్రాజెక్ట్ కోసం వెయ్యి 64 కోట్లు లోన్ తీసుకుంది.
అయితే.. అందులోనుంచి కోట్లాది రూపాయలు పక్కదారిపట్టించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఏళ్లు గడిచినా పనుల్లో పురోగతి లేదంటూ రాంచీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలవగా.. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ విచారణ జరిపి, నిధుల మళ్లింపుపై కూపీ లాగి 2019లో కేసు నమోదు చేసింది. 2020లో సీబీఐ చార్జీ షీట్ ఫైల్ చేసింది.
ఎఫ్ఐఆర్లో మధుకాన్ డైరెక్టర్లు శ్రీనివాస్రావు, సీతయ్య, పృథ్వీ తేజ్ల పేర్లను చేర్చింది. మరోవైపు.. గతేడాది రాంచీ-జంషెడ్ పూర్ పనుల నుంచి కూడా మధుకాన్ కంపెనీని తొలగించారు. కంపెనీ డైరెక్టర్లపై కూడా సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మధుకాన్ ఆడిటర్లపై కేసులు నమోదు చేసింది. విచారణ అనంతరం.. నామాకు నోటిసులు జారీచేసిన ఈడీ, విచారణకు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని నోటీసులో స్పష్టంచేసింది.