Nama Nageswara Rao : టీఆర్ఎస్ ఎంపీ నామా కార్యాలయాల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు

టీఆర్‌ఎస్ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీల్లో ఈడీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Nama Nageswara Rao : టీఆర్ఎస్ ఎంపీ నామా కార్యాలయాల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు

Ed Searches Continue At Offices Of Trs Mps Firm

Nama Nageswara Rao : టీఆర్‌ఎస్ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీల్లో ఈడీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం నుంచి నామా నాగేశ్వరరావుకు చెందిన ఖమ్మం హైదరాబాద్ లోని ఇళ్లల్లో, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన ఈడీ భారీ ఎత్తున నగదు గుర్తించినట్లు తెలుస్తోంది. పలు బ్యాంకుల్లో లాకర్లు గుర్తించిన ఈడీ అధికారులు నామా సమక్షంలో వాటిని తెరవగా అందులో భారీ ఎత్తున నగదు బయటపడినట్లు సమాచారం. ఈరోజు ఉదయం నుంచి మధుకాన్ కంపెనీలలో ఆరు చోట్ల ఏకకాలంలో సోదాలు  నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం ఎన్‌ఫోర్స్‌మెంట్   డైరెక్టరేట్ అధికారులు సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో నుంచి రూ.264 కోట్ల రూపాయలను మనీ లాండరింగ్ కు పాల్పడి అక్రమంగావిదేశాలకు తరలించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

వివిధ బ్యాంకుల నుంచి 1,064 కోట్లు రుణాలు తీసుకుని వాటిని విదేశాలకు తరలించారనే అభియోగాలతో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించగా.. నామాతో పాటు మధుకాన్‌ డైరెక్టర్ల ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయా సంస్థల అకౌంట్లు, డాక్యుమెంట్లు, కాంట్రాక్టులకు సంబంధించిన సమాచారం తీసుకున్నారు. 2011లో రాంచీ-జంషెడ్‌పూర్ హైవే కాంట్రాక్ట్‌ను మధుకాన్ సంస్థ దక్కించుకుంది. ఆ ప్రాజెక్ట్ కోసం వెయ్యి 64 కోట్లు లోన్ తీసుకుంది.

అందులోనుంచి కోట్లాది రూపాయలు పక్కదారిపట్టించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఏళ్లు గడిచినా పనుల్లో పురోగతి లేదంటూ రాంచీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలవగా.. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్‌కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ విచారణ జరిపి, నిధుల మళ్లింపుపై కూపీ లాగి 2019లో కేసు నమోదు చేసింది. 2020లో సీబీఐ చార్జీ షీట్ ఫైల్ చేసింది.

ఎఫ్ఐఆర్‌లో మధుకాన్ డైరెక్టర్లు శ్రీనివాస్‌రావు, సీతయ్య, పృథ్వీ తేజ్‌ల పేర్లను చేర్చింది. మరోవైపు.. గతేడాది రాంచీ-జంషెడ్ పూర్ పనుల నుంచి కూడా మధుకాన్ కంపెనీని తొలగించారు. కంపెనీ డైరెక్టర్లపై కూడా సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మధుకాన్ ఆడిటర్లపై కేసులు నమోదు చేసింది. విచారణ అనంతరం.. నామాకు నోటిసులు జారీచేసిన ఈడీ, విచారణకు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని నోటీసులో స్పష్టంచేసింది.