Telangana: తెలంగాణలో ‘విద్యుత్’ షాక్.. పెరగనున్న ఛార్జీలు
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థలు టారిఫ్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాయి.
Telangana: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థలు టారిఫ్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాయి. సుమారు 6వేల కోట్ల రూపాయల మేర పెంపు ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలికి అందించినట్లు తెలుస్తోంది.
ప్రతిపాదన ప్రకారం.. గృహ వినియోగదారులపై యూనిట్కు 50పైసలు, వాణిజ్య వినియోగదారులకు రూపాయి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలను ERCకి సమర్పించాయి డిస్కంలు. ఇక డిస్కమ్లకు 10వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉన్నట్లు నివేదిక ద్వారా తెలియజేశాయి.
సుమారు ఏడేళ్ల తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వగా.. సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. చార్జీల పెంపుతో డిస్కంలకు 6 వేల 831 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉండగా.. ఈ భారమంతా ప్రజలపైనే పడనుంది.
ఇక ఎస్సీ, ఎస్టీ డొమెస్టిక్ వినియోగదారులకు 101 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్, 25 లక్షల పంపుసెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్, సెలూన్లకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్తో పాటు పవర్ లూమ్స్, పౌల్ట్రీ రంగానికి యూనిట్కు 2 రూపాయల సబ్సిడీ ఉంది. రైల్వే చార్జీలు, బొగ్గు, రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం అయిందని అధికారులు చెబుతున్నారు.