Srisailam Reservoir : శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర,కర్ణాటకల్లో కురిసిన వర్షాలతో జూరాల ప్రాజెక్ట్ పూర్తి స్ధాయి నీటిమట్టానికి చేరుకుంది.
Srisailam Reservoir : కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర,కర్ణాటకల్లో కురిసిన వర్షాలతో జూరాల ప్రాజెక్ట్ పూర్తి స్ధాయి నీటిమట్టానికి చేరుకుంది. జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి అధికారులు 66,496 క్యూసెక్కుల నీరు, జూరాల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 34,179 క్యూసెక్కుల నీటిని కిందకు వదలటంతో ఆ వరదనీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది.
జూరాల జలాశయం పూర్తి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 318.42 మీటర్లు. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 9.42 టీఎంసీలుగా ఉంది. కాగా శ్రీశైలం జలాశయం పూర్తి స్ధాయి నీటిమట్టం 885 అఢుగులు కాగా ప్రస్తుతం 807 అడుగుల వీటి మట్టం ఉంది.
ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 38.2358 టీఎంసీలుగా ఉంది. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుండి 7,063 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కాగా ప్రాజెక్టులోకి మరింతగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.