తెలంగాణలో కరోనా బాధితుల ఫుడ్ మెనూ ఇదే.. బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు కోరింది తినొచ్చు!

  • Published By: sreehari ,Published On : April 9, 2020 / 07:31 AM IST
తెలంగాణలో కరోనా బాధితుల ఫుడ్ మెనూ ఇదే.. బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు కోరింది తినొచ్చు!

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కి చేరింది. ప్రస్తుతం 397 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 11 మంది మృతి చెందగా.. మరో 45 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా సోకి ఆస్ప్రతిలో చేరిన బాధితులను వైద్య సిబ్బంది ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కరోనా బాధితులు త్వరగా కోలుకునేందుకు అవసరమైన మందులతోపాటు మనోస్థైరాన్ని కూడా కల్పిస్తున్నారు. కోరిన ఆహారాన్ని కూడా అందిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు కోరిన ఆహారాన్ని ఫుడ్ మెనూగా అందిస్తున్నారు. 

కరోనా బాధితులు త్వరగా కోలుకోనేందుకు మందులతో పాటు పౌష్టికాహారం చాలా ముఖ్యం. కరోనా పాజిటివ్‌ వచ్చిన బాధితులకు నచ్చిన ఆహారాన్ని అందిస్తున్నారు. వారికి నచ్చిన ఫుడ్ ఇస్తున్నారు. ఉదయం అల్పాహారంలో టి, టిఫిన్‌ అందజేస్తున్నారు. ఇడ్లీ, చపాతీ, దోశ వంటివి అడుగుతున్నారు. మరికొందరు పాలు, బ్రెడ్డు తింటున్నారు. బాధితుడు కోరిన అదే ఆహారాన్ని అందజేస్తున్నట్టు డాక్టర్ రాజారావు తెలిపారు. 

ఇక మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్‌ అందిస్తున్నారు. రెండు రకాల కూరలతో పాటు రైస్‌ సహా పెరుగు, ఎగ్, సాంబార్‌లు అందజేస్తున్నారు. సాయంత్రం బాదం, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్‌తో పాటు ఇతర పండ్లను ఆహారంగా అందజేస్తున్నారు. రాత్రి డిన్నర్‌లో రైస్, చపాతీ పెడుతున్నారు. రోగి కోసం రోజుకు నాలుగు లీటర్ల మినరల్‌ వాటర్‌ బాటిళ్లను అందిస్తున్నారు. రాత్రివేళ్లలో ఎప్పుడైనా దాహం వేస్తే తాగేందుకు మినరల్ బాటిళ్లు అందుబాటులో ఉంచుతున్నారు. (అమెరికాలో కరోనా మరణమృదంగం…ఒక్కరోజే దాదాపు 2 వేల మంది మృతి)

కరోనా నాలుగో స్టేజ్‌లో ఉన్న వాళ్లను ఐసీయూకు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఆస్పత్రిలో స్పెషలిస్టులందరూ 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం
నలుగురు మాత్రమే ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరికి ప్రొటోకాల్‌ ట్రీట్‌మెంట్‌తో పాటు వారి కండిషన్‌ను బట్టి చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ, హార్ట్‌ పనితీరులో ఏమైనా లోపాలుంటే వెంటనే సంబంధిత మందులు ఇస్తున్నారు. బీ కాంప్లెక్స్, విటమిన్‌ సీ వంటి టాబ్లెట్స్‌ కూడా బాధితులకు ఇస్తున్నారు.