Telangana : తెలంగాణలో అందరికీ ఫ్రీగా కరోనా వ్యాక్సినేషన్

కరోనా వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Telangana : తెలంగాణలో అందరికీ ఫ్రీగా కరోనా వ్యాక్సినేషన్

Cm Kcr

Free Corona Vaccination : కరోనా వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో ఉన్న ప్రతొక్కరికీ వాక్సినేషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇలా మొత్తం అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి సుమారు రూ. 2500 కోట్ల పైగా ఖర్చు అవుతుందని, ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదని..అందరికీ వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని కేసీఆర్ అన్నారు.



ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి అనేక సెక్టార్లలో పనిచేస్తున్న జనాభా కలుపుకుని, తెలంగాణ రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్లమంది దాకా ప్రజలు ఉన్నారని తెలిపారు. వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వాక్సినేషన్ (టీకా) ఇవ్వడం జరిగిందని, దీనికి సంబంధించిన ఆదేశాలను ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, వైద్యశాఖ అధికారులకూ ఇవ్వడం జరిగిందన్నారు. తదనుగుణంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే భారత్ బయోటెక్ వాక్సినేషన్ తయారీ చేస్తోందని, రెడ్డీ ల్యాబ్స్ తో సహా మరికొన్ని సంస్థలు వాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయన్నారు. వాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని మరోసారి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో తనకు అవసరమైన వైద్య పరీక్షలు జరిగి, పూర్తి స్వస్థత చేకూరిన తరువాత సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తానన్నారు. అంతేగాకుండా…వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. వాక్సినేషన్ కార్యక్రమం పటిష్టంగా, విజయవంతంగా అమలు చేయడానికి జిల్లాలవారీగా ఇన్ ఛార్జులను నియమించడం కూడా జరుగుతుందని చెప్పారు.



వాక్సినేషన్ కార్యక్రమంతో పాటు, రెమిడెసివర్ తదితర కరోనా సంబంధిత మందులకు, ఆక్సిజన్ కు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురికావద్దని సూచించారు. కరోనా సోకినవారికి పడకల విషయంలోనూ, మందుల విషయంలోనూ ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తోందని వివరించారు. ప్రజలను కోవిడ్ బారి నుంచి కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు, పెద్ద ఎత్తున శానిటేషన్ చేపట్టుతోందన్నారు. అధైర్య పడవద్దని, అదే విధంగా ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. పెద్ద ఎత్తున గుంపు – గుంపులుగా గుమికూడవద్దని, ఊరేగింపులలో పాల్గొనవద్దని..అత్యవసరమైతేనే తప్ప బయట తిరగవద్దని..స్వయం క్రమశిక్షణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల క్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం కరోనా మహమ్మారి విషయంలో చేయాల్సినదంతా పటిష్టంగా చేస్తోందని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.

Read More : Oxygen Langar : ఉచితంగా ఊపిరి పోస్తున్నారు… శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న కరోనా రోగులకు అక్కడ ఆక్సిజన్‌ ఫ్రీ