గాంధీ ఆస్పత్రిలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కు ఏర్పాట్లు : మంత్రి ఈటల
Organ Transplantation at Gandhi Hospital : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని ఆర్గాన్ ట్రాన్స్పాంటేషన్ కేంద్రంగా మార్చనున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కిడ్నీ, హార్ట్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదై ఏడాది పూర్తైన సందర్భంగా గాంధీ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో కరోనా రోగులకు సేవలు అందించిన వైద్య సిబ్బందని మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్యాదవ్ అభినందించారు.
కరోనా రోగులకు సేవలు చేయడంలో వైద్య సిబ్బంది పడ్డ కష్టాలను గుర్తు చేశారు. పేదలకు ఆధునిక వైద్యం అందించేలా గాంధీ ఆస్పత్రిలో అన్ని హంగులు కల్పిస్తామని మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా గాంధీ ఆస్పత్రి సేవలందిస్తుందని శ్రీనివాస్యాదవ్ చెప్పారు.
రాబోయే రోజుల్లో టిమ్స్ ఆస్పత్రిని నిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఈటెల రాజేందర్ అన్నారు. కరోనా కట్టడికి ఏడాది కాలంగా శ్రమించామని తెలిపారు. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదన్నారు. కోవిడ్ పేషెంట్స్ రికవరీ రేటు 99 శాతం ఉందని చెప్పారు. మరింత కమిట్మెంట్తో పని చేస్తామని పేర్కొన్నారు. టిమ్స్ని నిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. వ్యాక్సిన్పై అపోహలు తొలగిపోతున్నాయని తెలిపారు. కరోనా కేసులు తక్కువగా ఉన్నా.. జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.