TS Governor Tamilisai Soundararajan: టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు. బిల్లులో గవర్నర్ చేసిన పది సిఫారసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన గవర్నర్ తమిళిసై.. గురువారం ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేశారు. ఎట్టకేలకు దాదాపు నెల రోజుల తరువాత తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బిల్లు 2023కు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, సేవలను ఇంకా విస్తృత పర్చేందుకు ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో బిల్లులను ప్రవేశపెట్టింది. ఆ బిల్లును గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపించడం జరిగింది. అయితే, గవర్నర్ తమిళిసై బిల్లులోని కొన్ని అంశాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. తనకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకొనేందుకు అధికారుల వివరణ కోరారు. అంతేకాక, ఈ బిల్లులో ప్రధానంగా గవర్నర్ 10 సిఫారసులు చేశారు. బిల్లులో గవర్నర్ చేసిన పది సిఫార్సులకు ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో సంతృప్తి చెందిన తమిళిసై బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు.
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా కొత్త రోల్ ప్రారంభించారంటూ పేర్కొన్నారు. ఉద్యోగులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే బిల్లును నిశితంగా పరిశీలించినట్లు వివరించారు. న్యాయ సలహా కోరడంలో బిల్లుకు ఆమోదం తెలపడం కాస్త ఆలస్యమైందన్నారు. తాజాగా టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో తెలంగాణ ఆర్టీసీలో పనిచేస్తున్న మొత్తం 43,373 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.