Mulugu Encounter : ఎన్కౌంటర్లో గాయపడ్డ కానిస్టేబుల్కి హైదరాబాద్లో చికిత్స
ములుగు జిల్లా వెంకటాపురం మండల కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మరణించారు.
Mulugu Encounter : ములుగు జిల్లా వెంకటాపురం మండల కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మరణించారు. గ్రేహౌండ్స్ కు చెందిన మధు అనే కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. కానిస్టేబుల్ మధుకు అర చేతిలోంచి బుల్లెట్ కుడివైపు ఛాతీలోకి దూసుకు వెళ్లింది.
దీంతో పోలీసు అధికారులు కానిస్టేబుల్ ను హుటా హుటిన హన్మకొండకు తరలించారు. అక్కడి నుంచి ఆర్మీకి చెందిన ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు పంపించారు. అక్కడ నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. అక్కడ కానిస్టేబుల్కు వైద్యులు శస్త్ర చికిత్స చేస్తున్నారు. ఈరోజు రాత్రిలోపు అతని శరీరంలోని బుల్లెట్ ను బయటకు తీసే అవకాశం ఉంది.
Also Read : Encounter : తెలంగాణ, చత్తీస్గఢ్లలో ఎన్కౌంటర్-10 మంది మావోయిస్టులు మృతి
పోలీసు శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి చేరుకుని మధు ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి మధును పరామర్శించి ధైర్యం చెప్పారు. గ్రే హౌండ్స్ చీఫ్ శ్రీనివాసరెడ్డి, ఇంటిలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్, ఐజీ ప్రభాకర రావుతో సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలోనే ఉండి మధు ఆరోగ్య పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నారు.