TSPSC Group-1 Exam: నేడు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.. అభ్యర్థులు ఈ సూచనలు తప్పనిసరి పాటించాలి..
తెలంగాణ తొలిగ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ పరీక్షకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 503 పోస్టుల భర్తీకి ఈ పరీక్ష జరగనుండగా.. 3.80లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
TSPSC Group-1 Exam: తెలంగాణ తొలిగ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ పరీక్షకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 503 పోస్టుల భర్తీకి ఈ పరీక్ష జరగనుండగా.. 3.80లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. శనివారం అర్థరాత్రి వరకు 3.41 లక్షల మంది హాల్ టికెట్లు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే శనివారం ఒక్కరోజే 20వేల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు.
Group-1 Exam : అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. తొలిసారి బయోమెట్రిక్
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 349 కేంద్రాల్లో దాదాపు 1.55లక్షల మంది పరీక్ష రాయనున్నారు. మేడ్చల్ జిల్లాలో 51,931 మంది, ములుగు జిల్లాలో 1,933 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు.
అభ్యర్థులు ఇవి తెలుసుకోవాలి..
- పరీక్ష కేంద్రంలోకి ఉదయం 8.30 గంటల నుంచి 10.15 గంటల వరకు అనుమతిస్తారు. ఆ తరువాత అనుమతి ఉండదు.
- ప్రశ్నపత్రం తెరవగానే అందులో 150 ప్రశ్నలూ ముద్రించారో లేదో చూసుకోవాలి.
- ముద్రణ పొరపాట్లుంటే మరొకటి అడిగి తీసుకోవాలి. ప్రశ్నపత్రంపై జవాబులను మార్కు చేయవద్దు.
- ఓఎంఆర్ షీట్లో సూచించిన చోట కాకుండా ఎక్కడైనా హాల్ టికెట్ నంబరు రాసినా, ఇతర గుర్తులు వేసినా ఆ పత్రాన్ని చెల్లనిదిగా పరిగణిస్తారు.
- అభ్యర్థులు పరీక్ష సమయంలో బయోమెట్రిక్ నమోదు చేయాలి. హాల్ టికెట్తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురావాలి.
- పరీక్షకు ఏ, బీ, సీ, డీ సిరీస్ల స్థానంలో ఆరు అంకెల బహుళ సరీస్ల ప్రశ్నపత్రాలు రానున్నాయి. అభ్యర్థులు ఆరంకెల సిరీస్తో కూడిన ప్రశ్నాపత్రం కోడ్ ను ఓఎంఆర్ షీట్లో నమోదు చేసి, వృత్తాల్ని బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో బబ్లింగ్ చేయాలి.
- వృత్తాల్ని సరిగా నింపి బుక్లెట్ సిరీస్ నెంబరు రాయకున్నా, ఒక్క అంకెను తప్పించినా ఆ ఓఎంఆర్ను మూల్యాంకనానికి పరిగణలోకి తీసుకోరు.
- అభ్యర్థి పేరు ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. డబుల్ బబ్లింగ్, చాక్ పౌడర్, రబ్బరు వాడి జవాబును చెరిపిన, తప్పుగా వివరాలు పేర్కొన్న జవాబు పత్రాలను పరిశీలనలోకి తీసుకోబోమని కమిషన్ తెలిపింది.
- పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు హాల్ టికెట్తో పాటు పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓటరు, ఆధార్ కార్డు తదితర ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి.
- హాల్ టికెట్లను అభ్యర్థులు ఏ4 సైజు పేజీపై ప్రింటు తీసుకోవాలి. ఒకవేళ అభ్యర్థి ఫొటో, సిగ్నేచర్ ఫ్రింట్ కాకుంటే మూడు పాస్ పోర్టు ఫొటోలపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ తీసుకొని పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్ కు హామీ పత్రం ఇవ్వాలి.
- ఓఎంఆర్ పై అభ్యర్థి, ఇన్విజిలేటర్ ఇద్దరూ సంతకాలు చేయాలి. ఏ ఒక్కరి సంతకం లేకున్నా మూల్యాంకనానికి జబాబు పత్రాల్ని పరిశీలించరు.