Harish Rao Thanneeru : చెప్పేవన్నీ టీమిండియా.. చేసేవి మాత్రం తోడో ఇండియా- ప్రధాని మోదీపై మంత్రి హరీశ్ ఫైర్
Harish Rao : ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ సిఫారసులు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. రాష్ట్రానికి రావాల్సిన రూ.1,350 కోట్ల బకాయిలు ఇవ్వడం లేదు.
Harish Rao – Modi : ప్రధాని మోదీపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ చెప్పేవన్నీ టీమిండియా.. చేసేవి మాత్రం తోడో ఇండియా అని విమర్శించారు. నచ్చిన రాష్ట్రాలకు అడక్కుండానే ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్న కేంద్రం.. ప్రశ్నించిన రాష్ట్రాలకు అడిగినా కూడా ఏమీ ఇవ్వడం లేదని మండిపడ్డారు.
జూన్ 2.. మనకు స్వాతంత్య్ర దినం..
మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై మంత్రి హరీశ్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అవతరణ ఉత్సవాలు 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. అమరుల త్యాగాలను, 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. జూన్ 2 మనకు స్వాతంత్య్ర దినం లాంటిదని వ్యాఖ్యానించారు. నాడు సమైక్య రాష్ట్రంలో 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని.. నేడు తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శం అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.(Harish Rao Thanneeru)
నాడు ఉద్యమానికి రాలేదు, నేడు ఉత్సవాలకూ రావడం లేదు..
”తెలంగాణ ఆచరిస్తున్నది, దేశం అనుసరిస్తోంది. అన్ని వర్గాలు ప్రగతి పథంలో ఉన్నాయి. కాంగ్రెస్, బిజెపిలకు ఉత్సవాలు జరపడం మింగుడుపడటం లేదు. ఉద్యమంలో నాడు రెండు పార్టీలు కలిసి రాలేదు. నేడు ఉత్సవాలకు రావడం లేదు. అమరుల త్యాగాలను కాంగ్రెస్ తక్కువ చేస్తోంది. బిజెపి వాళ్ళు ప్రత్యేకంగా ఉత్సవాలు చేస్తామని కిషన్ రెడ్డి చెబుతున్నారు. కానీ ఉద్యమంలో రాజీనామాకు ఆయన భయపడ్డారు. ఉత్సవాలు జరిపే నైతికత బిజెపికి ఉందా?
నచ్చిన వాళ్లకే ప్యాకేజీలు..
ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ సిఫారసులు చేసినా కేంద్రం ఏనాడు పట్టించుకోలేదు. విభజన సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలమైంది. కృష్ణా జలాల వాటా తేల్చరు. స్వయంగా సీఎం కేసీఆర్ లేఖలు రాసినా స్పందన లేదు. రాష్ట్రానికి రావాల్సిన రూ.1,350 కోట్ల బకాయిలు ఇవ్వడం లేదు.
కేంద్రానికి నచ్చిన రాష్ట్రాలకు మాత్రం ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు. ప్రశ్నించిన రాష్ట్రాలకు ఇవ్వడం లేదు. రాష్ట్ర అవతరణను వ్యతిరేకించడం అంటే అమరులను అవమానించడమే. నీతి ఆయోగ్ కు ఇజ్జత్ ఉందా? కేంద్రం ఏనాడైనా విలువ ఇచ్చిందా? ప్రధాని మోదీ కారణంగా ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతింది.(Harish Rao Thanneeru)
Also Read..Nizamabad Urban constituency: ఇందూరు రాజకీయం ఎలా ఉండబోతోంది.. గుప్త హ్యాట్రిక్ కొడతారా?
రూ.20వేల కోట్లు అడిగితే.. 20పైసలు కూడా ఇవ్వలేదు..
మిషన్ భగీరథకు రూ.20వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెబితే కనీసం 20 పైసలు ఇవ్వలేదు. నీతి ఆయోగ్ సమావేశాలకు గతంలో ఎన్నోసార్లు కెసిఆర్ హాజరయ్యారు. రాష్ట్ర అప్పుల గురించి కాదు కేంద్రం చేసిన అప్పుల సంగతి ముందు చెప్పండి. రాష్ట్రం పరిమితికి లోబడి అప్పులు చేశాము. కేంద్రం ఎప్పుడో పరిమితి దాటింది.
అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టరు?
పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టుమంటే ఎందుకు ముఖం చాటేస్తున్నారు. రాష్ట్రపతి, గవర్నర్ వ్యవస్థలకు తేడా తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలి. మోదీ చెప్పేవన్నీ టీమిండియా.. చేసేవి మాత్రం తోడో ఇండియా” అని మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.(Harish Rao Thanneeru)