ప్రియురాలిపై అత్యాచారం చేసి, కాల్చి చంపేశాడు
He raped and shot his girlfriend In Wanaparthy : వాళ్లిద్దరు ఏడేళ్లు ప్రేమించుకున్నారు. కలకాలం కలిసి ఉండాలని కలలు కన్నారు. ఇంతలోనే ఆ యువకుడు చేసిన ఊసులు, చెప్పిన మాటలు మరిచాడు. మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇది తెలిసి నిలదీసిన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. వనపర్తి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం ఖానపూర్ గ్రామానికి చెందిన యువతి హైదరాబాద్లోని ఓ షాపింగ్మాల్లో సేల్స్గర్ల్గా పనిచేసేది.
అక్కడే ఆత్మకూరుకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఏడేళ్ల క్రితం ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లు ఆ యువతితో బాగానే ఉన్న శ్రీనివాస్ ఆ తర్వాత తరచూ గొడవపడేవాడు. ఒకవైపు ప్రేమాయణం సాగిస్తున్న శ్రీనివాస్.. మరోవైపు వేరే యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి.. శ్రీనివాస్ను నిలదీసింది. దీంతో ప్రేమించిన ప్రియురాలినే చంపాలని నిర్ణయించుకున్నాడు శ్రీనివాస్. ఇందుకోసం పక్కా ప్రణాళిక రచించాడు.ఈనెల 10న శ్రీనివాస్ తన ప్రియురాలికి ఫోన్ చేసి.. గ్రామానికి రావాలని చెప్పాడు.
దీంతో ఆ యువతి హైదరాబాద్ నుంచి అమరచింతకు బయలుదేరిరాగా…. జడ్చర్లలో ఆమెను బైకుపై పికప్ చేసుకున్నాడు. అక్కడి నుంచి అమరచింతకు వెళ్లారు. మాయమాటలు చెప్పి.. అమరచింత సమీపంలోని కొత్తతండాలోని పంటపొలాల్లోకి తీసుకెళ్లి అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఆపై హత్య చేసి.. మృతదేహానికి పెట్రోల్పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీనివాసులు పరారయ్యాడు.
మరోవైపు ఇంటికి వస్తున్నానని చెప్పిన తమ కూతురు ఎంతకీ రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఫోన్ చేయగా…స్విచాఫ్ వచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ నెల 11 తేదీన అమరచింత పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని మృతదేహం పోలీసులకు లభ్యమైంది. ఈ ఫోన్ నంబర్ ఆధారంగా యువతి డెడ్బాడీగా గుర్తించారు. దీంతో యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీనివాస్ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అయితే శ్రీనివాస్ ఒక్కడే ఈ హత్య చేశాడా.. లేక ఇంకెవరైనా అతనికి సహకరించారా అన్నది తేలాల్సి ఉంది. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.