Telangana : తనకు తానే చితి పేర్చుకుని నిప్పు పెట్టుకుని ప్రాణాలు తీసుకున్నవృద్ధుడు.. పట్టెడు మెతుకుల కోసం సొంతూరు వదల్లేక మంటల్లో కాలిపోయిన దీనగాథ..

కన్నకొడుకులకు భారమైన తండ్రి గుండెల్ని కదిలించే దీన గాథ. 90 ఏళ్ల వయస్సులో పట్టెడుమెతుకుల కోసం సొంతూరు వదల్లేక ఉన్న ఊరు వదిలివెళ్లలేనయ్యా అంటూ అంగలార్చిన ఓ తండ్రి ఆవేదన మంటల్లో కాలిపోయింది. తాను పేర్చుకున్న చితికి తానే నిప్పుపెట్టుకుని చనిపోయిన తండ్రి కథ గుండెల్ని కదిలించేస్తోంది.

Telangana : తనకు తానే చితి పేర్చుకుని నిప్పు పెట్టుకుని ప్రాణాలు తీసుకున్నవృద్ధుడు.. పట్టెడు మెతుకుల కోసం సొంతూరు వదల్లేక మంటల్లో కాలిపోయిన దీనగాథ..

90 year man venkataiah

Telangana : కన్నబిడ్డల కోసం జీవితమంతా కష్టపడిన ఓ తండ్రి వయస్సు ఉడిగాక కన్నతండ్రిని బరువుగా భావించిన కొడుకులకు భారంగా ఉండటం ఇష్టంలేని తండ్రి చేసిన పని కన్నీరు తెప్పిస్తోంది. తనకు తానే చితి పేర్చకుని నిప్పు పెట్టుకుని మంటల్లో కాలిపోయిన ఓ వృద్ధుడు దీనగాథ సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

సిద్దిపేట జిల్లా పొట్లపల్లికి చెందిన మెడ‌బోయిన వెంక‌ట‌య్య90 ఏళ్లు. ఆయనకు నలుగురు కుమారులు. అందరికి పెళ్లిళ్లు చేశాడు. తనకున్న ఆస్తిని పంచి ఇచ్చాడు. క్రిత‌మే వెంక‌ట‌య్య భార్య చ‌నిపోయింది. ఆస్తిని పంచుకున్న కొడుకులు కన్నతండ్రిని పంచుకోవాలనుకున్నారు. వంతుల వారీగా తండ్రిని పోషించాలని అనుకున్నారు. దీని కోసం గ్రామంలో పంచాయితీ పెట్టారు. తండ్రికి పట్టెడు మెతుకులు పెట్టటానికి వంతులు వేసుకున్నారు. దీంతో ఆ తండ్రి గుండె పగిలింది. వంతుల జీవితాన్ని వెళ్లదీయలేక..తనను భారంగా భావించి కొడుకులకు దూరంగా వెళ్లిపోవాలనుకున్నాడు. కన్నబిడ్డలకు భారమయ్యననే బాధ కృంగదీస్తుంటే ఆ ముసలిగుండె తట్టుకోలేకపోయింది. ఆ బాధతోనే అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. తాను చనిపోతే అత్యక్రియలు చేసే భారాన్ని కూడా కొడుకులకు ఇవ్వకూడదనుకున్నాడు. గుండెల్లో బాధ దహించివేస్తుంటే 90 ఏండ్ల వృద్ధాప్యంలో తన చితిని తానే పేర్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు.

వెంకటయ్య నలుగురు కొడుకులు వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటు కుటుంబాలతో జీవనం సాగిస్తున్నారు. నలుగురు కొడుకుల్లో ఇద్దరు పొట్లప‌ల్లిలో ఉంటుండగా… ఒక‌రు హుస్నాబాద్‌లో, మ‌రొక‌రు క‌రీంన‌గ‌ర్ జిల్లా చిగురుమామిడి మండ‌లం న‌వాబ్‌పేట‌లో స్థిర‌ప‌డ్డారు. వెంకటయ్య .. త‌న‌కున్న నాలుగు ఎక‌రాల భూమిని కూడా కుమారుల‌కు సమానంగా పంచేశాడు. వెంకటయ్యకు వృద్ధాప్య పింఛ‌న్‌ వస్తోంది. దాంతోనే ఖర్చులు వెళ్లతీసుకుంటూ పెద్దకొడుకు క‌న‌క‌య్య ఇంట్లోనే ఉంటున్నాడు.

ఈక్రమంలో కొన్ని నెలల క్రితం వెంకటయ్యను పోషించే విషయంలో కొడుకులు గొడవపడ్డారు. గ్రామంలో పంచాయితీ పెట్టారు. పొట్లపల్లిలో పెద్దమనుషుల సమక్షంలో నెలకు ఒకరు చొప్పున నలుగురు కొడుకులు వంతులవారీగా తండ్రి వెంకటయ్యను పోషించాలని పెద్దమనుషులు నిర్ణయించారు. పొట్లపల్లి గ్రామంలో ఉంటున్న పెద్ద కుమారుడు వంతు పూర్తి కావడంతో నవాబుపేటలోని రెండో కుమారుడి వద్దకు వెంకటయ్య వెళ్లాల్సి ఉంది.

దీంతో సొంతూరిని, ఇంటిని వదిలి వెళ్లడం ఇష్టంలేని వెంకటయ్య .. అదే గ్రామంలోని ఓవ్యక్తివద్ద తన బాధ వెళ్లబోసుకున్నాడు. సొంతూరు వదిలివెళ్లలేనయ్యా అంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. ఈక్రమంలో సొంతూరు వదిలి వెళ్లాలనే బాధ ఓ పక్క కన్నకొడుకులకు భారమయ్యేనని బాధ గుండెల్ని మెలిపెట్టేస్తుంటే అడుగులో అడుగు వేసుకుంటూ గత మూడో తేదీన పొద్దున లేచిన వెంకటయ్య రెండో కుమారుడి ద‌గ్గరకు వెళ్తున్నాన‌ని చెప్పి పొట్లపల్లి నుంచి బ‌య‌ల్దేరాడు.

కానీ సాయంత్రం అయినా వెళతానన్న కొడుకు ఇంటికి వెళ్లలేదు. మే 4వ తేదీ గురువారం మ‌ధ్యాహ్నం పొట్లప‌ల్లి ఎల్లమ్మగుట్ట వ‌ద్ద మంట‌ల్లో కాలిన స్థితిలో ఓ వృద్ధుడి మృత‌దేహం క‌నిపించింది. దీంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించటంతో వెంకటయ్య దారుణ దుస్థితి బయటపడింది. ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం వృద్ధుడు వెంక‌టయ్యదే అని గుర్తించారు. తాటి కమ్మలను ఒక చోట కుప్పగా పేర్చుకుని వాటికి నిప్పంటించి, అందులోకి దూకి ఆత్మహ‌త్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింది.