MLC Kavitha: అప్పుడు మీరెక్కడున్నారు? రాహుల్ గాంధీని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత.. వినూత్న రీతిలో ఆహ్వానం
తెలంగాణలో పొలిటికల్ హీట్ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,,,
MLC Kavitha: తెలంగాణలో పొలిటికల్ హీట్ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనం గోస – బీజేపీ భరోసా బహిరంగ సభలో పాల్గొని తెరాస ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేడు ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. నేడు, రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం హనుమకొండలో జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. అయితే ఈ సభలో వ్యవసాయ ఉత్పత్తులు, రుణమాఫీ, మద్దతు ధర తదితరాలపై రాహుల్ కీలక ప్రకటనలు, హామీలు చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ పర్యటనను ఉద్ధేశించి తెరాస నేత, ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.
Rahul gandhi: నేడు, రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన.. షెడ్యూల్ ఇలా..
మీరు కానీ, మీ పార్టీ కానీ పార్లమెంట్లో తెలంగాణ అంశాలు, హక్కులను ఎన్నిసార్లు ప్రస్తావించారో చెప్పాలంటూ రాహుల్ గాంధీని కవిత ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులకోసం పార్లమెంట్ లో టీఆర్ఎస్ పోరాడుతుంటే అప్పుడు మీరెక్కడ ఉన్నారంటూ కవిత ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా వరి కొనుగోలు విధానం ఒకేలా ఉండాలని తాము పోరాడుతున్నప్పుడు ఎక్కడికిపోయారని, తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, నిధుల గురించి టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యా సంస్థలు ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారంటూ రాహుల్ గాంధీని ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదిగాక ప్రశ్నించారు.
As Shri @RahulGandhi Ji arrives in Telangana today, I sincerely request him to introspect on the following. How many times have you raised the issues of #Telangana in parliament ? 1/4 pic.twitter.com/f9aOYz69jE
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 6, 2022
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా వంటి పథకాలపై ఆరాతీసి అవి తెలంగాణ ముఖ చిత్రాన్ని ఎలా మార్చాయో మీ తెలంగాణ కాంగ్రెస్ నేతలను అడిగి తెలుసుకోండి అంటూ కవిత సూచించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను స్ఫూర్తిగా తీసుకొని 11 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయని, వాటి గురించి నేర్చుకుని అర్థం చేసుకోవడానికి మీకు కూడా తెలంగాణకు స్వాగతం అంటూ వినూత్న రీతిలో కవిత రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. తెలంగాణలో పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్న నేపథ్యంలో కవిత చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.