అమెరికా వెళ్తానన్న భార్య, నరికి చంపిన భర్త, ఆ తర్వాత ఆత్మహత్య.. గుండెలు పిండే విషాదం

అమెరికా వెళ్తానన్న భార్య, నరికి చంపిన భర్త, ఆ తర్వాత ఆత్మహత్య.. గుండెలు పిండే విషాదం

husband kills wife as she want to go america: ఇది గుండెలు పిండే విషాదం. అగ్రరాజ్యం అమెరికా… ఆలుమగల మధ్య చిచ్చు పెట్టింది. క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలయ్యాయి. మనస్పర్థలు ఆ వృద్ధ దంపతులను తిరిగిరాని లోకాలకు పంపాయి. శేష జీవితంలో ఒకరికొకరు తోడునీడగా కాలం వెళ్లదీయాల్సిన వృద్ధ దంపతుల జీవితాలు విషాదాంతమయ్యాయి. ఎంతో ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో చిన్నపాటి వివాదం హత్యకు దారితీసింది. అమెరికా వెళ్లే విషయంలో తలెత్తిన మనస్పర్ధలు ఆ ఇద్దరినీ బలిగొన్నాయి. క్షణికావేశంలో భార్యను నరికి చంపిన భర్త, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగంబంజర గ్రామానికి చెందిన సంక్రాంతి సుబ్రమణ్యేశ్వరరావు (65), విజయలక్ష్మి (60) దంపతులు. 45ఏళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు(సరిత, సునీత). కృష్ణా జిల్లా నుంచి ఖమ్మం వచ్చి స్థిరపడ్డారు ఈ దంపతులు. చిరువ్యాపారాలు చేసిన సుబ్రమణ్యేశ్వరరావు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. వీరి చిన్నకూతురు సునీత అమెరికాలో స్టాప్‌వేర్‌ ఇంజనీర్‌. అమెరికాలో ఉంటున్న సునీత.. తన దగ్గరికి రావాలని కొన్నాళ్లుగా తల్లిదండ్రులను కోరుతోంది. అమెరికా వెళ్లేందుకు విజయలక్ష్మి మొగ్గుచూపగా, సుబ్రమణ్యేశ్వరరావు మాత్రం నిరాకరించారు.

ఈ దశలో అమెరికా వెళ్లే విషయమై భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడే వద్దు తర్వాత వెళ్లొచ్చని భర్త సుబ్రమణ్యేశ్వరరావు చెప్పగా, ఆమె మాత్రం వినలేదు. తాను ఒకదాన్నైనా అమెరికాకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టింది. కూతురు కూడా తల్లికి టికెట్ తీసుకుంది. మార్చి 15న విజయలక్ష్మి అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే, అమెరికా వెళ్లే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తరుచుగా దంపతులు వాగ్వాదానికి దిగారు. కొన్ని రోజులుగా ఇదే తంతు. రాత్రి కూడా అమెరికా విషయమై దంపతుల మధ్య గొడవ జరిగింది. భార్య తన మాట కాదనడంతో భర్త ఆవేశానికి లోనయ్యాడు.

క్షణికావేశానికి లోనైన భర్త.. తన భార్యని కత్తితో మెడపై నరికి చంపాడు. ఆ తర్వాత, తాను ఏం చేశానో తెలుసుకుని కుంగిపోయాడు. తాను కూడా బతక్కూడదని నిర్ణయించుకున్నాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం(మార్చి 3,2021) ఉదయం పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తి కొనఊపిరితో అపస్మారక స్థితిలో ఉన్న సుబ్రమణ్యేశ్వరరావును చూసి షాక్ అయ్యాడు. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చాడు. స్థానికులు ఆయనను అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మృతి చెందాడు.

భార్యను చంపిన భర్త.. రాత్రంతా రక్తపు అడుగులతోనే ఇళ్లంతా తిరిగాడు. తెల్లవారిన తర్వాత వరండాలో తిరిగాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగి ఇంట్లో పడుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది. 4 దశాబ్దాలుగా ఎంతో అనోన్యంగా ఉన్న దంపతులు.. ఇలా అర్థాంతరంగా ప్రాణాలు విడవటం అందరిని కంటతడి పెట్టించింది.