Huzurabad By-Election : ఏ క్షణమైనా హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ !

తెలంగాణలో పొలిటికల్ హీట్ రాజేసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ రెండు లేదా మూడో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Huzurabad By-Election : ఏ క్షణమైనా హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ !

Assembly By Elections

Assembly by-elections Schedule : తెలంగాణలో పొలిటికల్ హీట్ రాజేసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ రెండు లేదా మూడో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నేడు కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఈ భేటీలో ఉప ఎన్నికలపై క్లారిటీ రానుంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఈసీ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. హుజూరాబాద్ తోపాటు ఏపీలోని బద్వేల్ లోనూ ఉప ఎన్నిక జరగాల్సివుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావాల్సివుంది. ఈసీ షెడ్యూల్ కోసం రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

ఏపీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఒడిశా, హర్యానా, రాజస్థాన్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఏపీలో బద్వేల్, తెలంగాణలో హుజురాబాద్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏపీలో3, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. ఈసీ షెడ్యూల్ సమాచారం తెలియడంతో ఇప్పటికే తెలంగాణ హుజురాబాద్ లో రాజకీయ వేడి మొదలైంది.

కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపద్యంలో ఉప ఎన్నికల నిర్వహణ విషయంలో ఈసీ ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా కోవిడ్ కేసులు పెరగడంతో కోర్టుల నుంచి ఈసీ ప్రశ్నలు ఎదుర్కొంది. దీంతో రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, ఎన్నికల నిర్వహణ కాలపరిమితి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఈసీ షెడ్యూల్ విడుదల ఏర్పాట్లు చేస్తోంది.

బెంగాల్ లో ఉప ఎన్నికల షెడ్యూల్ దీదీకి టెన్షన్ పుట్టిస్తోంది. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలపై నేడు మరో సారి టీఎంసీ నేతల బృందం సీఈసీని కలవనుంది. బెంగాల్ లో 7 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని టీఎంసీ బృందం ఈసీని కొరనుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోయినా మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నవంబర్ 4 లోపు ఉప ఎన్నిక జరిగి గెలుపోందితేనే మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.

రాష్ట్రాల్లో పాజిటివిటి రేటు, నియోజకవర్గాల్లో పోలింగ్ బూతుల ఏర్పాటు, నకిలీ ఓట్ల గుర్తింపు, ఎన్నికల సన్నద్దత తదితర అంశాల ఆధారంగా ఉప ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో యూపీ, ఉత్తరాఖండ్ లో అసెంబ్లీ ఉప ఎన్నికలలు లేనట్లేనని తెలుస్తోంది.