ఉత్తమ్‌తో కలిసి బీజేపీ సంజయ్ ఇదంతా చేస్తున్నారు, ఎమ్మెల్యే సైదిరెడ్డి

ఉత్తమ్‌తో కలిసి బీజేపీ సంజయ్ ఇదంతా చేస్తున్నారు, ఎమ్మెల్యే సైదిరెడ్డి

huzurnagar trs mla saidi reddy: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేత, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మండిపడ్డారు. గుర్రంపోడు తండాలో గిరిజనుల భూముల కబ్జా ఆరోపణలను ఆయన ఖండించారు. గిరిజనులను తప్పుదోవ పట్టించడమే బీజేపీ లక్ష్యం అని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. బీజేపీ నేతల తీరుతో ప్రతి ఒక్కరూ సిగ్గుపడుతున్నారని చెప్పారు. అసలు 540 సర్వే నెంబర్ గురించి బీజేపీకి తెలుసా? అని ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత ఉత్తమ్ తో కలిసి బీజేపీ సంజయ్ ఇదంతా చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రతి తండాకు నీరిచ్చేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. నాగార్జునసాగర్ లో ఓట్ల కోసం బీజేపీ డ్రామా ఆడుతోందని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు.

కాగా, బీజేపీ నేతలు గిరిజన భరోసా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నేతలు గిరిజనుల భూములు లాక్కుని… ఇబ్బందులు పెడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు తండాకు వెళ్లారు.

మఠంపల్లి మండలంలో తమ భూములు కబ్జా చేశారని స్థానిక గిరిజనులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. నాగార్జునసాగర్ నిర్వాసిత గిరిజనుల భూములను కబ్జా చేశారని అంటున్నారు. గుర్రంపోడు తండా.. సర్వే నెంబర్ 540లోని 18వందల 76 ఎకరాల భూములను సర్కారు అండతో.. స్థానిక టీఆర్ఎస్ నేతలు, వారి బినామీలు ఆక్రమించుకున్నారని విమర్శిస్తున్నారు. హుజూర్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి.. టీఆర్ఎస్ నేతలు భూ దందా చేస్తున్నారని.. గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని బీజేపీ అంటోంది.

గిరిజనుల భూముల్ని టీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే గిరిజనులపై దాడులు పెరిగాయని అన్నారు. పోలీసులతో తమను అడ్డుకోలేరని.. గిరిజనుల హక్కులను కాపాడుతామన్నారు.